తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఎంపీ సీట్లు గెలవలేకపోవడంపై విచారణ చేసేందుకు ఏఐసీసీ ఏర్పాటు చేసిన పార్టీ సీనియర్ నేత కురియన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ తెలంగాణకు చేరుకుంది
అభ్యర్థులు, నాయకులతో వరుస భేటీలు
విధాత, హైదరాబాద్ : తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఎంపీ సీట్లు గెలవలేకపోవడంపై విచారణ చేసేందుకు ఏఐసీసీ ఏర్పాటు చేసిన పార్టీ సీనియర్ నేత కురియన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ తెలంగాణకు చేరుకుంది. తొలి రోజు గాంధీభవన్లో పార్టీ ఎంపీ అభ్యర్థులతో భేటీ అయ్యింది. గెలిచిన, ఓడిపోయిన 17 మంది ఎంపీ అభ్యర్థులకు గాంధీ భవన్ నుంచి ఇప్పటికే పిలుపు రావడంతో వారంతా అక్కడికి చేరుకున్నారు. ముందుగా ఓడిన ఎంపీ అభ్యర్థులతో కురియన్ కమిటీ భేటీ అయ్యింది.
ఎంపీ ఎన్నికల్లో ఓడిన సీట్లలో పార్టీ ఓటమికి గల కారణాలను అక్కడి ఎంపీ అభ్యర్థుల నుంచి అడిగి తెలుసుకుంది. ఒక్కో అభ్యర్థితో విడివిడిగా భేటీయైన త్రిసభ్య కమిటీ ఓటమిపై పలు ప్రశ్నలను సంధించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. తొలుత సికింద్రాబాద్ నుంచి ఓడిపోయిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే దానం నాగేందర్ కమిటీ ముందు హాజరయ్యారు. ఆ తర్వాతా హైదరాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మహబూబ్నగర్, మెదక్ పార్లమెంటు సభ్యులతో భేటీ అయ్యారు.
ఒక్కో అభ్యర్థితో 30నిమిషాల పాటు చర్చించి ఓటమికి కారణాలపై ఆరా తీశారు. కురియన్ కమిటీతో భేటీ అనంతరం దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ సికింద్రాబాద్ స్థానంలో తప్పక గెలవాల్సి ఉన్నప్పటికీ కొన్ని పొరపాట్ల వల్ల పార్టీ ఓటమి పాలైందని ఈ విషయాన్ని కమిటీ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. పొరపాట్లను సరిదిద్దుకునేందుకు, అభ్యర్థులలో ఆత్మవిశ్వాసం, మనోధైర్యం కల్పించేందుకు ఇలాంటి సమీక్ష ఉపయోగపడుతుందన్నారు. దేశంలో ఏ పార్టీలో కూడా ఇలాంటి విధానం లేదని, జరిగిన లోపాలు సరిదిద్దుకోవడానికి మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. ఆదిలాబాద్లో ఆత్రం సుగుణ, కరీంనగర్లో వెలిచాల రాజేందర్ రావు, నిజామాబాద్లో టి.జీవన్రెడ్డి, మెదక్ లో నీలం మధు, మల్కాజిగిరిలో పట్నం సునీతమహేందర్ రెడ్డి, సికింద్రాబాద్లో దానం నాగేందర్, చేవెళ్లలో గడ్డం రంజిత్ రెడ్డి, మహబూబ్ నగర్లో చల్లా వంశీచంద్ రెడ్డి, హైదరాబాద్లో మహ్మద్ సమీర్ ఓటమి పాలయ్యారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 14స్థానాలు గెలుస్తామని అంచనా వేసుకుంది. చివరకు 8 స్థానాల్లో మాత్రమే గెలవడం ఆ పార్టీ నాయకత్వాన్ని షాక్కు గురి చేసింది.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై పలు రాష్ట్రాల్లో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో నిజనిర్ధారణ కమిటీలను వేసింది. కురియన్తో పాటు రకీబుల్ హుసేన్, పర్గత్ సింగ్లు తెలంగాణ కమిటీలో ఉన్నారు. రెండు మూడు రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాల్లో కురియన్ కమిటీ పర్యటించనుంది. టికెట్ రాని నేతలు సైతం తమ వాదనను కురియన్ కమిటీకి వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. కమిటీ రిపోర్ట్ను సీల్డ్ కవర్లో ఏఐసీసీకి అందిస్తామని కురియన్ కమిటీ తెలిపింది.