ల్కాజిగిరి నియోజకవర్గం ప్రజల ఆర్ధిక సామాజిక అభివృద్దే లక్ష్యంగా ముందుకు పోతున్నామని బీఆరెస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మచ్చ బొల్లారం డివిజన్ కౌకూర్ భరత్ నగర్ బస్ స్టాప్ వద్ద స్థానిక సమస్యలపై నిర్వహించిన ధర్నాలో మర్రి పాల్గొని మాట్లాడారు
విధాత, హైదరాబాద్ : మల్కాజిగిరి నియోజకవర్గం ప్రజల ఆర్ధిక సామాజిక అభివృద్దే లక్ష్యంగా ముందుకు పోతున్నామని బీఆరెస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మచ్చ బొల్లారం డివిజన్ కౌకూర్ భరత్ నగర్ బస్ స్టాప్ వద్ద స్థానిక సమస్యలపై నిర్వహించిన ధర్నాలో మర్రి పాల్గొని మాట్లాడారు. అనంతరం స్థానిక ప్రజలతో కలిసి భరత్ నగర్, రాజీవ్ గృహకల్ప, వాంబే కాలనీలలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కాలనీవాసులు తెలిపిన ఆయా సమస్యలకు సంబంధించిన అధికారులను అక్కడికే పిలిపించి వీలైనంత తొందరలో సమస్యలు పరిష్కరించాలని లేని యెడల పెద్ద ఎత్తున ప్రజలతో కలిసి మీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్కాజిగిరిలోని ఆయా డివిజన్ల పరిధిలోని సమస్యలపై జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబును అవసరం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాననీ ప్రజలకు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా మల్కాజిగిరిని అభివృద్ధి చేసుకుందామని ప్రజలను కోరారు. కావాలని కొందరు అభివృద్ధి పనులు జరగకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి అడ్డుతలుగుతున్నారని ఆరోపించారు.
వాటిని అధిగమించి మీ సహకారంతో ముందుకు పోదామని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మంచి నీళ్లు, డ్రైనేజీ, రోడ్లు, కరెంట్, వీధి దీపాలు తదితర సమస్యలతో ఇక్కడి ప్రజలు బాధపడుతున్నారని తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుండి ఈ సమస్యలపై స్థానిక అధికారులతో పాటు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లానని కానీ అధికారుల నుంచి పొంతనలేని సమాధానాలు వస్తున్నాయన్నారు. ఒకసారి నిధులు లేవని, మరోసారి సిబ్బంది లేరని అంటున్నారని తెలిపారు. అధికారం శాశ్వతం కాదనీ అధికారం లేనప్పడు ఒక్క తీరుగా ఉన్నప్పుడు ఒక్క తీరుగా ఉండే మనిషిని కాదని అన్ని వేళల మీకు అందుబాటులో ఉండే మనిషినని చెప్పారు. భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించారని, అదే తీరుగా మీ మద్దతు ఉంటే ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొని మీ సమస్యల పరిష్కారానికి ముందుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డీజీఎం, భాస్కర్, మేనేజర్ మల్లికార్జున్, జీహెచ్ఎంసీ డీఈ, కార్తీక్, ఏఈ రవళి, ఎలక్ట్రికల్ ఏఈ. వేణుగోపాల్, బీఆరెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.