Press Club Hyderabad| ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇమ్యూనిటీ, మోకాళ్ల నొప్పుల ఔషధాల పంపిణీ

ప్రెస్ క్లబ్ సభ్యుల కోసం రాధాస్ ఆయుర్వేద హాస్పిటల్, ఓజస్కా ఛైర్మన్ డాక్టర్ శరత్ అద్దంకి ఉచిత ఇమ్యూనిటీ కిట్లు, మోకాళ్ల నొప్పులను తగ్గించే ఔషధాలను అందజేశారు.

Press Club Hyderabad| ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇమ్యూనిటీ, మోకాళ్ల నొప్పుల ఔషధాల పంపిణీ

విధాత, హైదరాబాద్ : మన నిత్య జీవితంలో స్ట్రెస్ ఒక భాగం అయిపోయింది అని.. మరోవైపు సరైన ఆహారాన్ని సరైన విధంగా తీసుకోకపోవడం.. మన ఆరోగ్యాన్ని దెబ్బతీయడంలో కీలకంగా మారిందని, చిన్నచిన్న అనారోగ్యాల నుంచి క్యాన్సర్ దాకా అన్నింటికీ మూలం పొట్టలోనే ఉంది అని రాధాస్ ఆయుర్వేద హాస్పిటల్, ఓజస్కా ఛైర్మన్ డాక్టర్ శరత్ అద్దంకి(Dr Sharath Addanki )అన్నారు.

వార్తలతో కుస్తీపడుతూ, టైంతో పాటు పరుగులు తీసే జర్నలిస్టుల ( Journalists Health Program) కోసం హైదరాబాద్  ప్రెస్ క్లబ్(Press Club Hyderabad) ఆధ్వర్యంలో రాధాస్ ఆయుర్వేద హస్పిటల్( Radhas Ayurveda Hospital ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఇంటిగ్రేటెడ్ క్యాన్సర్ చికిత్సల గురించి అవగాహన కలిగించారు. అంతేగాక, చిన్నచిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే హాస్పిటల్స్ కోసం లక్షలు ఖర్చుపెట్టే అవసరం ఉండదని, మన ఇల్లే ఓ వైద్య శాల, మన ఇంటి నుంచే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు మొదలుపెట్టాలని చెప్పారు.

ఒకసారి క్యాన్సర్ వచ్చిందంటే కీమోథెరపీ, రేడియోథెరపీల వంటి చికిత్సలు తీసుకోకతప్పదు. కానీ వాటివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చాలామంది భయపడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారమే ఇంటిగ్రేటెడ్ క్యాన్సర్ చికిత్సలు. ఆయుర్వేదంతో పాటు గైడెడ్ ఇమేజరీ, అరోమా థెరపీ, సౌండ్ థెరపీ, యోగా, డైట్ వంటి వాటివల్ల సైడ్ ఎఫెక్టులు తగ్గించడమే కాకుండా, క్యాన్సర్ మళ్లీ రాకుండా నివారించే అవకాశం కూడా ఉంటుందని డాక్టర్ శరత్ అద్దంకి చెప్పారు.

చాలామందికి కడుపుబ్బరానికీ, అసిడిటీకి తేడా తెలియక టాబ్లెట్లు వాడుతుంటారనీ, యాంటాసిడ్ టాబ్లెట్లు వేసుకోవడం వల్ల కడుపుబ్బరం ఎక్కువ అవుతుందన్నారు. అందుకే మన ఇంట్లో ఉండే అల్లం, ఇంగువ వంటి వాటితోనే ఇలాంటి చిన్న సమస్యల నుంచి బయటపడవచ్చని తెలిపారు.

రొమ్ము క్యాన్సర్ వల్ల తల్లి మరణించడంతో సైడ్ ఎఫెక్టులను తగ్గించే క్యాన్సర్ చికిత్సలపై రీసెర్చ్ మొదలుపెట్టి, ఆయుర్వేద డాక్టర్ గా మారి అమెరికాలో ప్రముఖ ఇంటిగ్రేటెడ్ కాన్సర్ స్పెషలిస్ట్ గా కొనసాగుతున్న శరత్ అద్దంకి కోవిడ్ టైంలో సింగరేణి వాళ్లకోసం, ఇతర పేదల కోసం 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇమ్యూనిటీ కిట్స్ ని ఉచితంగా అందజేశారు. శ్రీనివాసన్ మునుస్వామి రాధా అద్దంకి ట్రస్ట్ ద్వారా విద్యార్థుల చదువు కోసం, ఆరోగ్యం కోసం సహకారం అందిస్తున్నారు. ఇప్పుడు ప్రెస్ క్లబ్ సభ్యుల కోసం కూడా ఉచిత ఇమ్యూనిటీ కిట్లు, మోకాళ్ల నొప్పులను తగ్గించే ఔషధాలను అందజేశారు.

ఈ సందర్భంగా అమెరికా నుంచి ప్రత్యేకంగా వచ్చి, జర్నలిస్టుల కోసం ఇలాంటి మంచి అవగాహనా కార్యక్రమాన్ని అందించిన డాక్టర్ శరత్ అద్దంకిని ఏపీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అభినందించి సత్కరించారు.

ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎస్. విజయ్ కుమార్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రమేశ్ వరికుప్పల మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సభ్యుల ఆరోగ్యం కోసం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. జర్నలిస్టులకు ఉచిత వైద్య సహాయం అందించిన డాక్టర్ శరత్ అద్దంకి, రాధాస్ ఆయుర్వేద హాస్పిటల్ బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.