Medak Fort Set For Rs 10 Crore Facelift To Boost Telangana Tourism
Medak Fort Facelift | కాకతీయుల కాలం నాటి చారిత్రక మెదక్ కోటకు కొత్త కళ రానుంది. కోట పరిరక్షణ, పునరుద్ధరణ పనులతో పాటు పర్యాటకులకు అవసరమైన సౌకర్యాల కల్పన కోసం రూ.10 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధమవుతోంది.
విధాత తెలంగాణ డెస్క్ | మే 22, 2026:
మెదక్: మెదక్ జిల్లాలోని చారిత్రక మెదక్ కోటను ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. కోట పరిరక్షణ, పునరుద్ధరణ పనులతో పాటు పర్యాటకులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు రూ.10 కోట్లు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ హామీ ఇచ్చారు. దీంతో చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురవుతున్న ఈ చారిత్రక కట్టడానికి కొత్త రూపు రానుంది.
మెదక్ జిల్లా కేంద్రానికి సమీపంలో కొండపై ఉన్న ఈ కోటకు గొప్ప చారిత్రక ప్రాధాన్యం ఉంది. 12వ–13వ శతాబ్దాల్లో కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఈ కోటను ఆ తర్వాత కుతుబ్షాహీ పాలకులు మరింత బలపరిచినట్లు చరిత్ర చెబుతోంది. వ్యూహాత్మకంగా ఎత్తైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ కోటలో పురాతన ద్వారాలు, ఫిరంగుల ఆనవాళ్లు, రాతి నిర్మాణాలు, రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఏర్పాట్లు, శిల్పకళ ఇప్పటికీ ఆకట్టుకుంటాయి. కోట పైభాగం నుంచి మెదక్ పట్టణం కనిపించే దృశ్యం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
తొలి దశలో మౌలిక వసతులు.. రెండో దశలో రోప్వే
మెదక్ కోట నుంచి కనిపించే మెదక్ కేథడ్రల్ చర్చి.. ప్రతిపాదిత టూరిస్ట్ సర్క్యూట్లో ఇది కీలక ఆకర్షణగా మారనుంది.
తెలంగాణ పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఏ వాణీ ప్రసాద్ ఆదేశాల మేరకు హెరిటేజ్ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్రావు, పురావస్తు శాఖ అధికారులు గురువారం మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ను కలిశారు. కోటలో చేపట్టాల్సిన పరిరక్షణ, పునరుద్ధరణ పనులపై వారు ప్రతిపాదనలు సమర్పించారు.
పర్యాటకులకు అనుకూలంగా కోటను తీర్చిదిద్దేందుకు తొలి దశలో తాగునీరు, మరుగుదొడ్లు, కూర్చునే బెంచీలు, సమాచార బోర్డులు వంటి మౌలిక వసతులు కల్పించనున్నారు. కోట చరిత్ర, నిర్మాణ ప్రాధాన్యం, కాకతీయ–కుతుబ్షాహీ వారసత్వాన్ని తెలియజేసే విధంగా కనీస సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని అధికారులు భావిస్తున్నారు.
రెండో దశలో మెదక్ కోటకు రోప్వే ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. దీనితో పాటు మ్యూజియం లేదా ఇంటర్ప్రిటేషన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. ఈ పనులకు కేంద్ర పర్యాటక శాఖ నుంచి కూడా నిధులు రాబట్టేందుకు ప్రతిపాదన పంపాలని హెరిటేజ్ విభాగం నిర్ణయించింది. కేంద్రం నుంచి నిధులు అందితే రెండు దశల పనులను ఒకేసారి చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
పర్యాటక సర్క్యూట్గా మెదక్ జిల్లా.. ఆధ్యాత్మిక, వారసత్వ ప్రాంతాలకు అనుసంధానం
మెదక్ పట్టణాన్ని వీక్షించేలా కొండపై విస్తరించి ఉన్న చారిత్రక మెదక్ కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు.
మెదక్ కోట అభివృద్ధితో పాటు జిల్లాలోని ప్రధాన పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను కలిపే ప్రత్యేక టూరిస్ట్ సర్క్యూట్ను రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో పోచారం డ్యాం, పోచారం వన్యప్రాణి అభయారణ్యం, మెదక్ కోట, మెదక్ కేథడ్రల్ చర్చి, కుల్చారం జైన ఆలయం, ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ ఆలయాన్ని అనుసంధానించే ఆలోచనల్లో ప్రభుత్వం ఉంది.
ఈ ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు పర్యాటకులకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే మెదక్ జిల్లా రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా ఎదగగలదని కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో హెరిటేజ్ విభాగం డిప్యూటీ డైరెక్టర్లు డాక్టర్ నాగరాజు, ఎన్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
కాకతీయుల కాలం నాటి మెదక్ కోటలోని పురాతన ద్వారం, రాతి శిల్పాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
చారిత్రక ప్రాధాన్యం, ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు—అన్నీకలిసిన పర్యాటక కేంద్రంలా మెదక్ను అభివృద్ధి చేసే ఈ ప్రణాళిక అమలైతే జిల్లాలో టూరిజానికి కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది.
