పురావస్తు, పర్యాటక శాఖలలో టూరిస్టు గైడ్ పోస్టులు
తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాల్లో గైడ్ల నియామకానికి పర్యాటక శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. 33 జిల్లాల నుంచి టూరిస్ట్ గైడ్స్- 2026 పోస్టుల కోసం డిగ్రీ అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పట్టభద్రుల నుండి దరఖాస్తులను ఆహ్వానించారు.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాల్లో గైడ్ల నియామకానికి పర్యాటక శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. 33 జిల్లాల నుంచి టూరిస్ట్ గైడ్స్- 2026 పోస్టుల కోసం డిగ్రీ అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పట్టభద్రుల నుండి దరఖాస్తులను ఆహ్వానించారు. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాలు, సాంస్కృతిక వారసత్వ ప్రాంతాల విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేందుకు నైపుణ్యం కలిగిన గైడ్ల అవసరం ఎంతైనా ఉంది. అందుకే రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఖాళీగా ఉన్న పర్యాటక గైడ్ పోస్టుల భర్తీకి, శిక్షణా కార్యక్రమానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు టూరిజం శాఖ ప్రకటించింది.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పురావస్తు, చారిత్రక మరియు వారసత్వ పర్యాటక ప్రదేశాలలో పనిచేసే అవకాశాన్ని నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ ద్వారా అందుకోవచ్చు. మంచి సంభాషణా నైపుణ్యాలు ఉండి, చరిత్ర, పురావస్తు శాస్త్రం, సంస్కృతి, కళ, వాస్తుశిల్పం, పర్యాటకం పట్ల అభిరుచి ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలకు సంబంధించి, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. చరిత్ర, ఆర్కియాలజీ, వారసత్వ కట్టడాలు, సంస్కృతి, కళలు, ఆర్కిటెక్చర్, పర్యాటక రంగాలపై ప్రత్యేక ఆసక్తి కలిగి ఉండాలి.
టూరిజం గైడ్ లకు శిక్షణకు రూ. 5 కోట్లు
పర్యాటక రంగం వినోదం, అహ్లాదంకే పరిమితం కాకుండా అది ఒక ప్రాంత చరిత్ర, నాగరికతను చాటిచెప్పే కార్యక్రమంగా గుర్తింపు పొందింది. పర్యాటకులు ఒక చారిత్రక ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఆ కట్టడం వెనుక ఉన్న కథను, దాని నిర్మాణ శైలిని, ప్రాముఖ్యతను వివరించడానికి ఒక సమర్ధుడైన గైడ్ అవసరం. చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాల గురించి వివరించే గైడ్లు లేకపోతే అవి కేవలం బొమ్మల్లాగే మిగిలిపోతాయి. అందుకే టూరిస్టు గైడ్ ల శిక్షణా కార్యక్రమం ద్వారా పర్యాటకులకు నాణ్యమైన సమాచారాన్ని అందించడమే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని పర్యాటక శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, కోటలు, కట్టడాల చరిత్రను వివరించేలా అంతర్జాతీయ స్థాయి గైడ్లను తయారు చేసేందుకు.. గైడ్ల శిక్షణ, అభివృద్ధి కోసం రూ.5 కోట్లను కేటాయిస్తున్నాం అని ఇటీవల పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు.
మావోయిస్టులకు ‘గిరి దర్శక్’ గైడ్ల పేరుతో పర్యాటక శాఖ ఉద్యోగాలు
ఇటీవల స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, పర్యాటక శాఖ సంయుక్తంగా లొంగిపోయిన మావోయిస్టులకు పునారావాస చర్యలలో భాగంగా పర్యాటక రంగంపై అవగాహన కల్పించేందుకు నెలరోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చాయి. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తి కావడంతో, ప్రభుత్వం వారిని అధికారికంగా విధుల్లోకి తీసుకుంది. వీరంతా ప్రధానంగా పర్యాటక ప్రాంతాలైన కర్రెగుట్టలు, భద్రాచలం, ములుగు జిల్లాల్లో గైడ్లుగా సేవలు అందించనున్నారు.‘గిరి దర్శక్’ గైడ్ల పేరుతో వారు ఇకపై పర్యాటకులకు మార్గనిర్దేశం చేయనున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram