Medaram Jatara : మేడారం జాతరకు మూడు కోట్ల మంది వస్తారని అధికారుల ప్రాథమిక అంచనా

మేడారం జాతరకు 3 కోట్ల మంది భక్తులు! ₹250 కోట్లతో భారీ ఏర్పాట్లు చేస్తూ, ప్రత్యేక యాప్ మరియు లోగోను మంత్రులు సీతక్క, లక్ష్మణ్ ఆవిష్కరించారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Jan 13, 2026, 7:53 pm IST
Read Time: 5 mins
Medaram Jatara : మేడారం జాతరకు మూడు కోట్ల మంది వస్తారని అధికారుల ప్రాథమిక అంచనా

విధాత, ప్రత్యేక ప్రతినిధి: ఈనెల 28వ తేదీ నుండి 31 వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ఈసారి దాదాపు మూడు కోట్లమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. జాతర నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు మేడారం జాతరపై మంగళవారం డా. బీ.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర గిరిజన, ఎస్సి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్, రాష్ట్ర పంచాయితీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖామంత్రి దనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్ కుమార్, సవ్యసాచి ఘోష్, అడిషనల్ డీజీలు విజయ్ కుమార్, స్వాతి లక్రా, వివిధ శాఖ కార్యదర్శులు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర తదితర అధికారులు పాల్గొన్నారు.

ఈ జాతర సందర్భంగా జాతీయ స్థాయిలో తెలంగాణకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చేందుకు శ్రమించాలని భావిస్తున్నారు. 2024 మేడారం జాతరకు కోటిన్నర మంది హాజరుకాగా, 2026 జాతరకు గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 150 కోట్ల నిధులను మంజూరు చేసి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నందున దాదాపు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా వసతి, పార్కింగ్, రవాణా సౌకర్యాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ విషయంలో వీఐపీలు–సామాన్య భక్తులు అనే తేడా లేకుండా, అందరికీ సమాన సౌకర్యాలు కల్పించాలని సమావేశంలో స్పష్టం చేశారు. మేడారానికి వచ్చే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నియంత్రణకుగాను డ్రోన్ లను ఉపయోగించుకోవాలన్నారు. ఈ సందర్బంగా, మేడారం జాతరకు వివిధ శాఖలు చేస్తున్న ఏర్పాట్లు, చేపట్టిన పనులు, వాటి పురోగతి పై ములుగు జిల్లా కలెక్టర్ దివాకర పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ద్వారా వివరించారు. మేడారం జాతరపై ములుగు జిల్లా యంత్రాంగం రూపొందించిన ప్రత్యేక లోగో, యాప్, వీడియోలను మంత్రులు సీతక్క, లక్షణ్ కుమార్, సి.ఎస్ రామకృష్ణ రావు లు ఆవిష్కారించారు.

ఇవి కూడా చదవండి :

Telangana Gram Panchayat Funds : గ్రామ పంచాయతీలకు తీపి కబురు.. రూ.277 కోట్లు విడుదల చేసిన ఆర్ధిక శాఖ
Greenland Annexation Bill : గ్రీన్‌లాండ్‌ స్వాధీనం కోసం అమెరికాలో బిల్లు.. ఈ ద్వీపంపై ట్రంప్‌ ఎందుకు కన్నేశారు..?