భువనగిరి, ఆలేరు నియోజక వర్గాలకు సంబంధించి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు సరఫరాపై సీఎం రేవంత్రెడ్డికి వివరించానని, సెప్టెంబరు చివరిలోగా 210 కోట్లతో ప్రతి గ్రామానికి గోదావరి నీళ్లను మిషన్ భగీరథ ద్వారా అందిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు
బస్వాపురం పనులు పూర్తి చేస్తాం
ఆగస్టు 15లోకి రైతు రుణమాఫీ
యాదగిరిగుట్ట అభివృద్ధికి సీఎంతో సమీక్ష
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడి
విధాత : భువనగిరి, ఆలేరు నియోజక వర్గాలకు సంబంధించి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు సరఫరాపై సీఎం రేవంత్రెడ్డికి వివరించానని, సెప్టెంబరు చివరిలోగా 210 కోట్లతో ప్రతి గ్రామానికి గోదావరి నీళ్లను మిషన్ భగీరథ ద్వారా అందిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. గురువారం యాదగిరిగుట్ట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. ముందుగా ఆయన కార్యాలయ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహానికి, తెలంగాణ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య, స్వామి వివేకానందన వర్ధంతి, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జన్మదినం పురస్కరించుకొని వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి వెంకట్రెడ్డి మాట్లాడుతూ రాబోయే రెండు సంవత్సరాలలో బస్వాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తామని, అసంపూర్తి పనులకు టెండర్లను పిలవబోతున్నట్లు తెలిపారు. జిల్లా అభివృద్ది కార్యక్రమాలలో భాగంగా ఆలేరు బైపాస్ పనులు 40 కోట్లతో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఆగష్టు 15 లోగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట సంబంధించి ఆటోల సమస్యలను పరిష్కరించి ఆటోలను గుట్ట పైకి అనుమతించి ఆటో డ్రైవర్లకు జీవన భృతి కల్పించడం జరిగిందని, యాదగిరిగుట్టలో షాపులు పోయినవారికి, భూములు ఇచ్చిన వారికి న్యాయం చేయడం జరుగుతుందని హామీనిచ్చారు.
యాదగిరిగుట్ట క్షేత్రాన్ని ఇంకా అభివృద్ది చేసి ప్రజలకు, వ్యాపారులకు సౌకర్యాలు కల్పిస్తామని, త్వరలోనే సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానించి యాదగిరిగుట్ట క్షేత్ర అభివృద్ది పనులను సమీక్షించనున్నట్లు తెలిపారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ల ప్రజాప్రతినిధులుగా బాగా పనిచేశారని సభ్యులను అభినందించారు. పదవి ప్రజల కోసమని, ప్రజల కోసం మనమంతా పనిచేయాలని, ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా వుండాలని అన్నారు. త్రాగునీటి, మురికి కాలువలు సంబంధించి ఏ సమస్య వచ్చినా నాకు గానీ, ప్రజాప్రతినిధులకు గానీ మెసేజీలు పంపినా అధికారుల సమన్వయంతో పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.
ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు బీర్ల అయిలయ్య మాట్లాడుతూ, గత ఐదు సంవత్సరాలుగా పార్టీలకతీతంగా ప్రజలకు ప్రభుత్వానికి స్థానిక సంస్థల ప్రతినిధులు వారథిగా పనిచేశారని, జిల్లా మంత్రి నేతృత్వంలో అందరి భాగస్వామ్యంతో ఇంకా అభివృద్ది పనులు చేసుకుందామని అన్నారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…. ఈ రోజు పదవీ కాలం పూర్తి చేసుకొన్న ప్రజాప్రతినిధులందరికీ వారి పదవీ కాలంలో అనేక అభివృద్ది పనులు చేశారని తెలియచేస్తూ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ శీశైలం, జడ్పీటీసీ అనూరాధ, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.