రోడ్ల విస్తరణ..నూతన రోడ్ల నిర్మాణానికి ప్రాధ్యానత
ఆర్ఆండ్బీ సమీక్షా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
విధాత, హైదరాబాద్ : రోడ్డు ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాలు దేశంలో ముందుండటం విచారకరమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం సచివాలయంలో ఆర్ఆండ్బీ అధికారులతో రాష్ట్రంలో రోడ్ల విస్తరణ పనుల పురోగతిని సమీక్షించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రుల భవనాల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వెంకట్రెడ్డి మాట్లాడుతూ రోడ్డు బాగలేకపోతే ప్రజలు కాంట్రాక్టర్లను, అధికారులను ఏమి అనరని, అక్కడి ప్రజాప్రతినిధులను, ప్రభుత్వాన్ని విమర్శిస్తారన్నారు. మాది అధికారుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని అయితే ఒకరిద్దరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల జీవితాలు ప్రభావితం అయితే అలాంటి అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ ప్రభుత్వమైన విజయవంతంగా పాలన సాగించాలంటే అధికారుల మద్దతు అవసరమన్నారు. రోడ్లు చెడిపోతే ఆ బాధ్యత కాంట్రాక్టర్లతో పాటు అధికారులకూ ఉంటుందన్నారు. తాను 24 గంటలు మీకు అదుబాటులో ఉంటానని, రోడ్లు బాగోలేక ప్రజలు ఎక్కడా ఇబ్బందులు పడవద్దని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన రోడ్లను అందించడమే మన లక్ష్యం కావాలని చెప్పారు. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు రోడ్ల నిర్మాణం తప్పనిసరి అన్నారు.
ఆర్ఆర్ఆర్ అభివృద్ధి కొత్త పుంతలు
ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో హైదరాబాద్ సహా రాష్ట్రా అభివృద్ధి కొత్త ఫుంతలు తొక్కుతుందని మంత్రి కోమటిరెడ్డి ఆకాంక్షించారు. ఓఆర్ఆర్ తరహాలోనే ఆర్ఆర్ఆర్ రాష్ట్రా అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందన్నారు. పెట్టుబడుల సాధనంగా ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఔటర్ , ఆర్ఆర్ఆర్ ల మధ్య రేడియల్ రోడ్లు నిర్మించబోతున్నామని, మూడు దశలుగా ఔటర్ లోపల, ఔటర్, ఆర్ఆర్ఆర్ల మధ్య, ఆర్ఆర్ఆర్ బయట గ్రామీణ ప్రాంతాల వరకు అభివృద్ధి జరిగేలా పరిశ్రమలు వచ్చేలా చూస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ యుటిలిటీ ఛార్జీల చెల్లింకపోవడం వల్ల పనులు ఆగిపోయాయని, సీఎం రేవంత్ రెడ్డి, నేను కేంద్ర మంత్రి నితిన్ గడ్కారిని కలిసి యుటిలిటీ ఛార్జీలను కడతామని చెప్పడంతో పనులకు ఆమోదం లభించిందన్నారు.
జాతీయ రహదారులు నిర్మాణ పనులు వేగంగా చేయాలన్నారు. ఎన్ హెచ్-65 ని గ్రీన్ ఫీల్డ్ హైవేగా నిర్మాణం కోసం ముందుకు వెళ్తున్నామన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు సంవత్సరాలుగా నత్తనడకన సాగడంపై అధికారులను మంత్రి ప్రశ్నించారు. అంబర్ పేట్ ఫైటర్ పనులు పూర్తిగా కాబోతున్నాయని మరో నెల రోజుల్లో ట్రాఫిక్ కు అనుమతిస్తాని ఈఎన్సీ మంత్రికి వివరించారు. సమావేశంలో రాష్ట్రంలో జాతీయ రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, బ్లాక్ స్పాట్ల రిపేర్లపై చర్చించారు. వివిధ దశల్లో కొనసాగుతున్న ఆసుపత్రుల భవనాల నిర్మాణాల పురోగతిని సమీక్షించిన మంత్రి అధికారులకు అవసరమైన సూచనలిచ్చారు.