మంత్రి పొంగులేటి వర్సెస్ కౌశిక్ రెడ్డి

కమలాపూర్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరుపార్టీల కార్యకర్తలు నినాదాలతో ఆందోళనకు దిగడంతో కార్యక్రమాన్ని అర్థాంతరంగా ముగించారు.

వేదికలు ఏవైనా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచే హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ దఫా రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో వాగ్వివాదానికి దిగారు. కమలాపూర్ మండలంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కొల్లగొట్టడం వల్లే ఆశించిన స్థాయిలో సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నామంటూ వ్యాఖ్యానించారు. దీంతో వేదికపై ఉన్న పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహంతో పొంగులేటి ప్రసంగానికి అడ్డుపడ్డారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి అబద్ధాలు చెప్తున్నారంటూ పొంగులేటిపై కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు.. నిజాలు మాట్లాడాలని, ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేయవద్దంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఇరువురి మధ్య వాగ్యుద్దం కొనసాగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… కేసీఆర్ కట్టించిన ఇండ్లను ముట్టుకోమనే సిద్ధాంతం లేకుండా ప్రజలకు ఆ ఇళ్లు ఇస్తున్నామని చెప్పగా…అవును రు ఇచ్చే డబుల్ బెడ్రూం ఇండ్లు కేసీఆర్ కట్టించినవేనంటూ కౌశిక్ రెడ్డి మరోసారి వాగ్వివాదం పెట్టుకున్నారు.

దీంతో సభా ప్రాంగణంలోని కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీ నినాదాలతో పరస్పరం వేదికపైకి దూసుకరావడంతో కార్యక్రమాన్ని అర్థాంతరంగా ముగించేశారు.

Latest News