విధాత, హైదరాబాద్ :
ప్రజా భవన్లో తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ కాన్ఫరెన్స్లో మహిళలకు ఉపాధి అవకాశాలు, వివక్ష నిర్మూలన, లింగ సమానత్వం, మహిళల భద్రత, ఆరోగ్యం, పోషకాహారం వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. నిపుణుల అభిప్రాయాలు, సూచనలు, అనుభవాలను ప్రభుత్వం తెలుసుకుని భవిష్యత్ విధానాల్లో ప్రతిబింబింపజేయాలనే ఉద్దేశంతో రౌండ్ టేబుల్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధి, ఆత్మవిశ్వాసం, హక్కుల బలోపేతం కోసం ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను పూర్తిగా తొలగించేందుకు నిపుణులు, మేధావులు, అధికారులు ఇచ్చే సూచనలు అత్యంత ఉపయోగకరమవుతాయని పేర్కొన్నారు. మహిళా సంక్షేమం, భద్రత కోసం చట్టాలు ఉన్నప్పటికీ, సమాజపు పోకడల కారణంగా అవి ప్రాక్టికల్గా అమలు కావడంలో సమస్యలు వస్తున్నాయనీ, పని ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొనే సమస్యలను చెప్పుకునే అవకాశాలు కోల్పోతున్నారని వివరించారు. ఈ చర్చ రాజకీయ కార్యక్రమం కాదని, మహిళల భవిష్యత్తును నిర్ణయించే చారిత్రక ఘట్టం అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
విద్య, ఉపాధి, ఉద్యోగాలు, భద్రత వంటి రంగాల్లో మహిళలకు ఏలాంటి సౌకర్యాలు అవసరమో తెలుసుకుని, సమగ్ర నివేదిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో వచ్చిన సూచనలు, సలహాలు ఆధారంగా త్వరలో విస్తృత స్థాయి సదస్సును ఏర్పాటు చేసి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 నాటికి ఒక కొత్త మహిళా విధానాన్ని రూపకల్పన చేస్తామని వెల్లడించారు. ఆడపిల్లల ఆరోగ్యం, వంద శాతం విద్య సాధన, మహిళల ఆర్థిక స్వావలంబన, మాతృత్వ సెలవులు ప్రైవేట్ రంగంలో అమలయ్యేలా చూడటం, తండ్రులూ పిల్లల పెంపకంలో భాగస్వామ్యం కావడం వంటి అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది.
పాఠశాలల్లో అమ్మాయిలను గౌరవించే సంస్కారాన్ని పెంపొందించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరాన్ని మంత్రి వివరించారు. మహిళలు “నా ఆరోగ్యం – నా బాధ్యత” అనే భావనతో ముందుకు రావాలని, వారికి తగిన ఆరోగ్య అవగాహన కల్పించే దిశలో చర్యలు తీసుకుంటామని సీతక్క చెప్పారు. నిపుణులతో సబ్ గ్రూప్లు ఏర్పాటు చేసి, ప్రత్యేక సమస్యలు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, వాటి పరిష్కార మార్గాలను గుర్తించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ రోజు జరిగిన సమావేశం తెలంగాణలో మహిళా సాధికారతకు పునాది వేసే తొలి మెట్టుగా నిలిచిపోతుందని మంత్రి సీతక్క విశ్వాసం వ్యక్తం చేశారు.
రేపటి తరం కోసం నేటి మేధోమధనం ఎంతో అవసరమని పేర్కొంటూ, తెలంగాణను మహిళా సాధికారతలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ సమావేశం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ సమావేశంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, హైదరాబాద్ కలెక్టర్ హరి చందన, సీనియర్ ఐఏఎస్ అధికారులు సీతాలక్ష్మి, అనిత రామచంద్రన్, జి సృజన, శృతి ఓజా, ఐ&పీఆర్ కమిషనర్ ప్రియాంకా ఆల, అదనపు డీజీ అభిలష్ బిస్త్తో పాటు పలువురు మహిళా ఐపీఎస్లు, బాలల హక్కుల కమిషన్ సభ్యులు, నిపుణులు, మేధావులు, సామాజికవేత్తలు పాల్గొన్నారు.
