బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన తల పొగరుతోనే 104మంది బీఆరెస్ ఎమ్మెల్యేల సంఖ్యను 39కి తెచ్చారని, అందులో నుంచి త్వరలోనే 25మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు
విధాత : బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన తల పొగరుతోనే 104మంది బీఆరెస్ ఎమ్మెల్యేల సంఖ్యను 39కి తెచ్చారని, అందులో నుంచి త్వరలోనే 25మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారని, తెలంగాణలో బీఆరెస్ పార్టీ ఖేల్ ఖతమవుతుందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. శనివారం గాంధీభవన్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు పరామర్శల పేరుతో పదేళ్లు ఫామ్హౌస్ నుంచి పాలన సాగించిన కేసీఆర్ అధికారం కోల్పోయి అసహనంతో కాంగ్రెస్ ప్రభుత్వంపైన, సీఎంపైన అడ్డగోలు భాషతో అబద్దాల ప్రచారంతో విమర్శలు చేస్తున్నాడని విమర్శించారు. ఈ కరవు కేసీఆర్ తెచ్చింది మాత్రమేనని, కాంగ్రెస్ తెచ్చింది కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ మాటలు ప్రజలు నమ్మొద్దని, రాష్ట్రంలో పవర్, డ్రింకింగ్ వాటర్ సమస్యలు రాకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. కేసీఆర్ కరీంనగర్ లో మాట్లాడిన ప్రతీ మాట అబద్దమేనని తిప్పికొట్టారు. మమ్ములను ఇష్టానుసారంగా దుర్భాషలాడారని, కేసీఆర్ లెక్క పాస్ పోర్ట్ లు అమ్మి, కాంట్రాక్టర్లకు బ్రోకర్ల లాగా తాము పనిచేయలేదన్నారు. ఎవరినో తొక్కడం కాదు…పార్లమెంటు ఎన్నికల్లో జనం కేసీఆర్ ను బొంద పెడతారని స్పష్టం చేశారు.
ఇరిగేషన్ పై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు కేసీఆర్ ఇంట్లో పడుకుని, రైతు పరామర్శలంటూ కేసీఆర్ పిచ్చిలేచినట్లు మాట్లాడుతున్నారని, కేసీఆర్ సిగ్గు శరం లజ్జ అన్ని వదిలేసి అబద్ధాలు మాట్లాడుతున్నాడని ఉత్తమ్ మండిపడ్డారు. ఇవ్వాళ బ్రోకర్, జోకర్ వ్యాఖ్యలు చేస్తున్న కేసీఆర్ …ఆనాడు సీఎంగా ఉండి మెడిగడ్డ పై ఎందుకు నోరు విప్పలేదన్నారు. కేసీఆర్ లెక్క వేరే రాష్ట్రాల్లో మాట్లాడితే ఉరి తీస్తారని చెప్పారు. సూర్యాపేటకు సాగునీళ్ళు కాదు ఇచ్చిందని, తాగునీరు మాత్రమే నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు వదిలారని స్పష్టం చేశారు. సూర్యాపేట, పాలేరుకు కేసీఆర్ ముఖం చూసి నీళ్ళు ఇవ్వలేదని, మా షెడ్యూల్ ప్రకారం ఇచ్చామని ఉత్తమ్ తెలిపారు. కేసీఆర్ అంతా పొగరుబోతు వ్యక్తిని నేను ఇంకొకరిని చూడలేదని, ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేసిన కేసీఆర్ కమిషన్ల కోసం రీడిజైన్లు చేసి నిర్మాణ అంచనాలను పెంచి పదేళ్లలో ఇరిగేషన్ మీద లక్షల కోట్ల దోపిడీకి పాల్పడ్డాడని ఉత్తమ్ మరోసారి ఆరోపించారు. కేసీఆర్ కమిషన్ల కక్కుర్తి వల్లే అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కాస్త కాళేశ్వరం ప్రాజెక్టు గా మారిందన్నారు. మాకు అభివృద్ధి చేయడం తెలుసు.. నీకు కమిషన్లు తీసుకోవడం తెలుసని కేసీఆర్ తీరును ఉత్తమ్ ఎండగట్టారు.
ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన చవట దద్దమ్మ కేసీఆర్ : మంత్రి జూపల్లి
చేనేతలను నాశనం చేసిందే కేసీఆర్ : మంత్రి పొన్నం చేనేత కార్మికులను అన్ని విధాల నాశనం చేసిందే కేసీఆర్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సిరిసిల్ల చేనేత కార్మికులకు బతుకమ్మ చీరలు నేయకపోతే బతుకు కొట్టినట్లా అని, చేనేత కార్మికులు నేచిన ప్రతీ బట్టను కొనాలని ఆదేశాలు ఉన్నాయన్నారు. కేసీఆర్ అత్తగారి ఊర్లో కట్టకు అటువైపు ఆయన, ఇటువైపు మేము ఉంటామని, ప్రజలు ఎవరి వైపు ఉంటారో చూద్దామా? అని సవాల్ చేశారు. మేము రేపటి నుంచి ఫీల్డ్ లో ఉంటామని, ఎవరు ఎవరిని తొక్కుతారో చూద్దామన్నారు. కరీంనగర్ కు ఐదు ఏళ్ళు ఎంపీగా నేను ఉన్నానని, కేసీఆర్ ఉన్నారని, రచ్చ ఎలా? చేస్తారో చూద్దామని సవాల్ చేశారు. పెద్దమనిషిగా తన మర్యాద కాపాడుకోకపోతే వేములవాడ గుడిముందు చెప్పులు ఎత్తుకొని వెళ్ళే వాళ్ళతో సమానంగా కేసీఆర్ను చూడాల్సివస్తుందన్నారు.
ధనిక రాష్ట్రాన్ని8లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన చవట దద్దమ్మ కేసీఆర్ అని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ప్రాంతీయడు తన ప్రాంతానికి అన్యాయం చేస్తే ప్రాంతంలోనే పాతి పెట్టాలి అనే సామెత ప్రకారం కేసీఆర్ ను పాతి పెట్టాలన్నారు. పదేళ్లలో పంట నష్టం ఎప్పుడైనా కేసీఆర్ ఇచ్చారా? ఫామ్ హౌస్ లో పండి కేసీఆర్ ప్రభుత్వాన్ని నడిపారని విమర్శించారు. నాలుగు మాసాల కాంగ్రెస్ పాలనను చూసి కేసీఆర్ ఉలిక్కి పడుతున్నారని, కేసీఆర్ కుర్చివేసుకొని కడుతా అన్న ప్రాజెక్టుల హామీలు ఒక్కటైనా అమలు అయ్యాయా? అని ప్రశ్నించారు. కేసీఆర్కు దమ్ముంటే మేడిగడ్డ కాదు పాలమూరుకు పోదామా? అని సవాల్ చేశారు. మిషన్ భగీరథలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని, సీఎం రేవంత్ 12సార్లు ఢిల్లీ పోయినా సోనియా , ఖర్గే అపాయింట్మెంట్ ఇచ్చారని, కేసీఆర్ హైదరాబాద్ లో ఉన్నా మంత్రులను కలవలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసినా ఒక్కటి సీటు లోక్ సభ లో రాదని, కేసీఆర్ వ్యవహారాలను మేము పక్కన ఉండి చూశామని, కేసీఆర్ను ప్రజలు నమ్మే పరిస్తితి లేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆరెస్ ఓడిపోతే పార్టీనే రద్దు చేసుకుంటా అని చెప్పే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమేనని, తాను కాల్ చేయకున్నా గతంలో పొంగులేటికి నా ఫోన్ నుంచి కాల్ వెళ్లిందని, ట్యాపింగ్పై ఆధారాలను విచారణాధికారులకు సమర్పిస్తామని జూపల్లి వెల్లడించారు.