జాతిపిత మహాత్మా గాంధీ చూపిన మార్గంలో పయనించి ఆయన ఆశయాలు సాధిద్దామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.
MLA Yennam Srinivas Reddy | విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: జాతిపిత మహాత్మా గాంధీ చూపిన మార్గంలో పయనించి ఆయన ఆశయాలు సాధిద్దామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని గడియారం చౌరస్తా వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయుధం లేకుండా శాంతితోనే మహాత్ముడు బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారన్నారు. స్వాతంత్ర్యం అంటే ప్రతి వ్యక్తి చట్టప్రకారం తనకు నచ్చిన పద్ధతుల్లో సంతోషంగా, స్వేచ్ఛగా జీవించడమే అని అన్నారు.
అధికారం ఉందికదా అని నియంతృత్వ పోకడలతో ప్రజలపై జులుం ప్రదర్శిoచిన నాటి బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకలించి వేసిన గాంధీని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనేక దేశాల్లో గాంధీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు జరుపుకోవడమే కాకుండా గాంధీ చూపిన అహింసా మార్గంలో నడుస్తున్నాయని ఎన్నం పేర్కొన్నారు. బీ ఆర్ఎస్ పాలనను పదేళ్లు భరించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటు ద్వారా మార్పును కోరుకుని స్వేచ్ఛను తెచ్చుకున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు వసంత, మాజీ అధ్యక్షురాలు బెక్కరి అనిత, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సీజే బెనహర్, లింగం నాయక్, లక్ష్మణ్ యాదవ్, రామచంద్రయ్య, నర్సింహారెడ్డి, అవేజ్, రాములు యాదవ్, ప్రవీణ్ కుమార్, జగదీష్, సత్యం పాల్గొన్నారు.