విధాత : ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రముఖ తెలంగాణ కవి, రచయిత నందిని సిధారెడ్డిని వరించింది. 2026 సంవత్సరానికి గాను ఆయన రాసిన “అనిమేష” కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులు, మానవీయ కోణాలను ఈ కవితా సంపుటిలో సిధారెడ్డి చిత్రించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కింద ఆయనకు రూ. లక్ష నగదు, తామ్రపత్రం, శాలువాను ప్రదానం చేస్తారు.
సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం రాష్ట్రానికే గర్వకారణమని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలంగాణ మట్టి సువాసనను, ఉద్యమ స్ఫూర్తిని తన కలంతో విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ కవి, సాహితీవేత్త శ్రీ నందిని సిధారెడ్డి కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం అత్యంత సంతోషదాయకం అని, ఇది తెలంగాణ సాహిత్యానికి దక్కిన గౌరవం. వారికి నా హృదయపూర్వక అభినందనలు అని కేటీఆర్ తెలిపారు.
మాజీ మంత్రి టి.హరీశ్ రావు సైతం ఎక్స్ వేదికగా సిధా రెడ్డికి అభినందనలు తెలిపారు. నాగేటి సాల్లల్ల నా తెలంగాణ….’ అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు, మన నందిని సిధారెడ్డి ని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించడం గర్వకారణం. తెలంగాణ అస్తిత్వాన్ని అక్షరబద్ధం చేసిన మీ కృషి వెలకట్టలేనిది. ఈ పురస్కారం మీ సాహితీ ప్రస్థానానికి దక్కిన అసలైన గుర్తింపు. మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని హరీశ్ రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
ఉద్యమ చరిత్రను రూపుమాపేందుకే బతుకమ్మ లేని తెలంగాణ తల్లి : కవిత ధ్వజం
Telangana Thalli | ఇటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ..అటు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ
