మోదీ తొలిసారి వేములవాడ రానున్న నేపథ్యంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ఎములాడ రాజన్నను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించేలా పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది.
రాజన్న దర్శనం.. అనంతరం సభ!
జిల్లా నేతలకు సమాచారం
సభ విజయవంతంపై బీజేపీ ఫోకస్
శక్తి కేంద్ర ఇన్చార్జ్లతో బండి భేటీ
విధాత బ్యూరో, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే నెల 8న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించే అవకాశముంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుండి రాష్ట్ర కార్యాలయానికి సమాచారం అందిందని తెలుస్తున్నది. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. ప్రధాని మోదీ మే 8న ఉదయం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వేములవాడలో పర్యటిస్తారు. ప్రధాని రాక సమాచారాన్ని అందుకున్న జిల్లా నాయకత్వం సభాస్థలి, ఏర్పాట్లపై దృష్టి సారించింది. మోదీ తొలిసారి వేములవాడ రానున్న నేపథ్యంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ఎములాడ రాజన్నను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించేలా పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 10 గంటలకు రాజన్న దర్శనాంతరం వేములవాడలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించేలా షెడ్యూల్ను ఖరారు చేస్తున్నట్టు సమాచారం. ప్రధాని పర్యటన పూర్తి షెడ్యూల్ రెండు, మూడు రోజుల్లో అధికారికంగా వెల్లడయ్యే అవకాశముందని చెబుతున్నారు.
ఎంపీ కార్యాలయంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ శక్తి కేంద్ర ఇన్చార్జ్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రధాని మోదీ మే 8న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో వేములవాడలో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని, సభను దిగ్విజయవంతం చేసేలా ప్రతి ఒక్క కార్యకర్త క్రుషి చేయాలని కోరారు. అందులో భాగంగా ప్రధాని ఎన్నికల ప్రచార బహిరంగ సభాస్థలిని ఎంపిక చేసేందుకు మంగళవారం మధ్యాహ్నం వేములవాడ వెళ్లనున్నారు. సభాస్థలి ఎంపిక అనంతరం జిల్లా, నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమై మోదీ సభ ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మీసాల చంద్రయ్య, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, అసెంబ్లీ కన్వీనర్ దుబ్బాల శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల అసెంబ్లీ నుండి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేసిన పత్తిపాక సురేష్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వీరందరికీ సంజయ్ కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరిన వారిలో సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన వెంకటేశ్, బుదారం సదానంద్, బీమని నగేశ్, కొంపల్లి మురళి, గుడ్ల సురేష్ కుమార్, శ్రీధర్, దాసరి వెంకటేశ్, ఆడెపు లక్ష్మణ్, సత్యవికాస్, బలుసాని అనిల్, తుపాకుల రమేశ్, శివపురం శ్రీనివాస్, బోగ కనకయ్య, శ్రీరాం విష్ణు, బూర పవన్, పల్లె ప్రశాంత్ తదితరులు ఉన్నారు.