విధాత: వసతి గృహంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిజాం కళాశాల విద్యార్థినులు రోడ్డెక్కారు. హైదరాబాద్ బషీర్ బాగ్ హాస్టల్ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ప్రిన్సిపాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత నెల రోజులుగా నీటి కొరత సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదని విద్యార్ధినులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ జామై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తక్షణమే ప్రిన్సిపల్ తమ వద్దకు వచ్చి, స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. సంఘటనాస్థలికి వచ్చిన డీసీపీ వెంకటేశ్వర్లు విద్యార్థులకు నచ్చజెప్పినా వినకపోవడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు.