Hyderabad | కొనసాగుతున్న నిజాం కళాశాల విద్యార్థినిల ఆందోళన
నిజాం కళాశాల హాస్టల్ డిగ్రీ విద్యార్థినిల కోసం నిర్మించిన హాస్టల్ను పీజీ విద్యార్థినిలకు 50శాతం కేటాయించకుండా పూర్తిగా తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ యూజీ విద్యార్థినిలు చేపట్టిన ఆందోళన గురువారం ఆరవ రోజుకు చేరుకుంది

సమస్యపై మాజీ మంత్రి సబితకు వినతి
విధాత, హైదరాబాద్: నిజాం కళాశాల హాస్టల్ డిగ్రీ విద్యార్థినిల కోసం నిర్మించిన హాస్టల్ను పీజీ విద్యార్థినిలకు 50శాతం కేటాయించకుండా పూర్తిగా తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ యూజీ విద్యార్థినిలు చేపట్టిన ఆందోళన గురువారం ఆరవ రోజుకు చేరుకుంది. గత ప్రభుత్వం నిజాం కాలేజ్ విద్యార్థినుల కోసం, యూజీ అమ్మాయిలకు, పీజీ అమ్మాయిలకు వేర్వేరుగా హాస్టల్ భవనాలు కట్టించింది. అయితే ప్రస్తుతమున్న యూజీ హాస్టల్ భవనంలో పీజీ అమ్మాయిలకు 50 శాతం, యూజీ అమ్మాయిలకు 50 శాతం కేటాయించడాన్ని నిరసిస్తూ విద్యార్థినులు ధర్నా చేపట్టారు.
కాగా.. తమ సమస్యపై విద్యార్థినిలు మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి గతంలో మీరిచ్చిన ఆదేశాలకు అనుగుణంగా 100 శాతం యూజీ విద్యార్థినులకే హాస్టల్ భవనం కేటాయించేలా చూడాలని విద్యార్థినులు కోరారు. అమ్మాయిల ధర్నా పట్ల సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్నటువంటి కేటాయింపుల మాదిరిగానే 100 శాతం యూజీ విద్యార్థినులకు కేటాయించి వారికి న్యాయం చేయాల్సిందిగా నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ భీమా నాయక్కు సబితా ఇంద్రారెడ్డి సూచించారు. కాగా తమ ఆందోళనలో భాగంగా డిగ్రీ విద్యార్థినిలు ఇవాళ వంటావార్పు చేపట్టారు. వసతి గృహాన్ని యూజీ విద్యార్థినులకే కేటాయించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.