అవినీతి అనేది బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో కనిపించే ఉమ్మడి లక్షణమని, "కుటుంబం వల్ల.. కుటుంబం చేత.. కుటుంబం కోసం.." నినాదంతో ఆ రెండు పార్టీలు పనిచేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు
వాళ్లకు కుటుంబమే తొలి ప్రాధాన్యత
ఆర్ ఆర్ టాక్స్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వసూళ్లను మించిపోయింది
మాజీ ప్రధాని పీవీని అడుగడుగునా అవమానించారు
కరీంనగర్లో బండి విజయం నిర్ణయం అయిపోయింది
వేములవాడ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ
విధాత బ్యూరో, కరీంనగర్: అవినీతి అనేది బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో కనిపించే ఉమ్మడి లక్షణమని, “కుటుంబం వల్ల.. కుటుంబం చేత.. కుటుంబం కోసం..” నినాదంతో ఆ రెండు పార్టీలు పనిచేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. తెలంగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.
కరీంనగర్ లోకసభ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కు మద్దతుగా వేములవాడ నియోజకవర్గం కేంద్రంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని దక్షిణ కాశీగా పిలిచే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి కోడెమొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు స్వాగతం పలికి జ్ఞాపికను అందజేశారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ “మీ ఓటు వల్లే ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దాం.. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం.. రైతులకు అండగా ఉన్నాం.. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం.. డ్రోన్లను ప్రోత్సహించాం.. టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటు చేశాం.. రైతుకు పెట్టుబడి సాయం అందించి ఆదుకున్నా మని” తెలిపారు.
మూడు విడతలు మనమే..
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన మూడు విడతల ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రభావం అంతంత మాత్రమే, మిగిలిన నాలుగు విడతల్లోనూ బిజెపి, ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు కుటుంబమే తొలి ప్రాధాన్యత అని, బిజెపి మాత్రం దేశానికే తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివని.. ఈ అవినీతి పార్టీలు తెలంగాణ ప్రజల స్వప్నాన్ని కాలరాసాయన్నారు.
తెలంగాణ సాకారం అయితే, తమ కలలు నెరవేరుతాయని ప్రజలు ఆశించారని, కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను బీఆర్ఎస్ తాకట్టుపెట్టి కేవలం తన కుటుంబ లబ్ధి కోసమే పని చేసిందన్నారు. స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ కూడా కుటుంబ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసిందని చెప్పారు.
వాళ్లది ఫెవికాల్ బంధం…
అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలది ఫెవికాల్ బంధం.. ప్రజల ముందు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం, తెర వెనుక సిండికేట్ కావడం ఆ పార్టీల నేతలకు అలవాటే అన్నారు. ఓటుకు నోటు కేసులో ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆ అంశాన్ని మర్చిపోగా,
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం అవినీతిపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ అవినీతిపై దర్యాప్తు చేయడం లేదన్నారు.
ఆర్ఆర్ఆర్ వసూళ్లను మించిపోయాయి..
పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ వసూళ్లను, ఆర్ ఆర్ టాక్స్ వసూళ్లు మించిపోయాయని విమర్శించారు. తెలంగాణ నుండి ఢిల్లీ వరకు దేశవ్యాప్తంగా ఆర్ఆర్ టాక్స్ పై చర్చ జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రజల సొమ్మును ఒక ‘ఆర్’లూటీ చేసి, ఢిల్లీలోని ‘ఆర్’ కు అందజేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వీళ్ళ ఆటలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారని తెలిపారు.
పీవీకి అవమానం…
కరీంనగర్ బిడ్డ మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ఆయన చెప్పారు. ఆయన పార్థివ దేహాన్ని కూడా కాంగ్రెస్ కార్యాలయంలోకి అనుమతించని విషయాన్ని గుర్తు చేశారు. అయితే తమ ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించి గౌరవించిందని తెలిపారు.
బండి విజయం నిర్ణయమైంది..
కరీంనగర్ లోకసభ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ విజయం ముందే నిర్ణయం అయిపోయిందని ప్రధాని తెలిపారు. కరీంనగర్ లోకాంగ్రెస్ ఓటమి ఖాయమైందన్నారు. ఆ పార్టీ అభ్యర్థి ఎవరో ప్రజలకే తెలియని పరిస్థితి ఉందన్నారు. ఇక ఇక్కడ బీఆర్ఎస్ ప్రభావం మచ్చుకైనా కానరావడం లేదన్నారు.