రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ , గత ప్రభుత్వం నిలిపేసిన పథకాలేంటి? అధికారులతో భట్టి, తుమ్మల సమీక్ష

గత ప్రభుత్వం అధికారంలోకివచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో నిలిపివేసిన వ్యవసాయ పథకాలేంటి? ఎందుకు వాటిని నిలిపివేశారో వివరాలు అందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు.

  • Publish Date - June 25, 2024 / 07:54 PM IST

హైదరాబాద్‌: గత ప్రభుత్వం అధికారంలోకివచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో నిలిపివేసిన వ్యవసాయ పథకాలేంటి? ఎందుకు వాటిని నిలిపివేశారో వివరాలు అందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో మ్యాచింగ్ ద్వారా వచ్చే పథకాలు, నిధులను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు తెలిపారు. వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారుల తో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం సమీక్షించారు. పంటల బీమాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు. రాబోయే సీజన్ కు పంటల బీమాకు సంబంధించి పిలవాల్సిన టెండర్లపై చర్చించారు. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల్లో ఉన్న వ్యవసాయ కళాశాలలు, ఇప్పటికీ కళాశాలలు లేని జిల్లాల వివరాలను డిప్యూటీ సీఎం సమావేశంలో తీసుకున్నారు. సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యకలాపాలపై ఆరా తీశారు. వ్యవసాయ కళాశాలలో విత్తన అభివృద్ధి తీరుపై చర్చించారు. రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని, అయితే వ్యవసాయం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే ఉత్పత్తులు పెరిగి రాష్ట్ర ఖజానాకు, రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.

రాష్ట్ర ఖజానాకు అత్యధిక ఆదాయం సమకూర్చే రంగాలు.. ప్రభుత్వం తదితర రంగాలపై చేస్తున్న ఖర్చులను డిప్యూటీ సీఎం అధికారుల ద్వారా విచారించారు. ఇక రైతు భరోసా కు సంబంధించి రైతుల అభిప్రాయం ఎలా ఉంది, ఏ విధంగా ముందుకు పోతే మంచిది అనే విషయాలను రైతుల ద్వారానే తెలుసుకుంటే మంచిదని భట్టివిక్రమార్క అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ నిర్వహించి, రైతులను భాగస్వాములను చేయాలని సూచించారు. అందులో మంత్రులు కూడా పాల్గొంటే కార్యక్రమం మరింత ప్రయోజనాత్మకంగా ఉంటుందని తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ కు నిధులు కేటాయిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు అభిప్రాయం వ్యక్తపరిచారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా పథకాలకు ఇప్పటివరకు చేస్తున్న ఖర్చు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా రాబోయే రోజుల్లో పెరుగుతున్న బడ్జెట్ పై సమీక్ష చేశారు. ఆయిల్ పామ్ సాగులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలపై చర్చించారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న నేతన్న చేయూత, నేతన్న బీమా పథకాలు ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర విభజన తర్వాత చేనేత కార్మికుల జీవితాల్లో వచ్చిన మార్పులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను విచారించారు. సిరిసిల్ల కో-ఆపరేటివ్ సొసైటి, టెక్స్ టైల్ వ్యాపారస్తులు ప్రభుత్వం నుంచి ఏ పద్ధతిలో ప్రయోజనం పొందుతున్నారనే అంశాలను అధికారులు సమావేశంలో వివరించారు. సమావేశంలో స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావు, ఆర్థిక శాఖ అడిషనల్ సెక్రెటరీ హరిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Latest News