Sunetra Pawar : సునేత్ర పవార్‌కు డిప్యూటీ సీఎం పదవి.. ఎన్సీపీ కొత్త బాస్ ఎవరు..?

అజిత్ పవార్ మృతి తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. డిప్యూటీ సీఎం పదవి సునేత్ర పవార్‌కు దక్కుతుందా? ఎన్సీపీ కొత్త బాస్ ఎవరు అన్నది హాట్ టాపిక్‌గా మారింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jan 30, 2026, 12:52 pm IST
Read Time: 5 mins
Sunetra Pawar : సునేత్ర పవార్‌కు డిప్యూటీ సీఎం పదవి.. ఎన్సీపీ కొత్త బాస్ ఎవరు..?

మహారాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణంతో మహా రాజకీయాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకొన్నాయి. అదే సమయంలో ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాలపై అందరి దృష్టి పడింది.

అజిత్‌ పవార్‌ మరణంతో తదుపరి డిప్యూటీ సీఎం (Deputy CM) ఎవరు..? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)ని నడిపించేది ఎవరు..? అన్న చర్చ నడుస్తోంది. పార్టీలోని పలువరు సీనియర్లు డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్నారు. అయితే, మెజారిటీ నేతలు మాత్రం పవార్‌ స్థానాన్ని ఆయన భార్య సునేత్ర పవార్‌ (Sunetra Pawar)కే ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. అజిత్ దాదా వారసత్వాన్ని కొనసాగించేందుకు సునేత్రనే సరైన వ్యక్తి అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మహాయుతి కూటమి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పార్టీ వర్గాల టాక్‌.

సునేత్ర పవార్‌ ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. పవార్‌ మరణంతో ఆమె డిప్యూటీ సీఎం పదవి చేపడితే.. బారామతి నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. డిప్యూటీ సీఎంతో పాటూ పార్టీ పగ్గాలు కూడా సునేత్రకే అప్పగించాలని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, అందుకు ఆమె అంగీకరించకపోతే.. ప్రఫుల్ పటేల్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొనే అవకాశం ఉందని సమాచారం.

లోక్‌సభ ఎన్నికల్లో సునేత్ర ఓటమి..

2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో సునేత్ర పవార్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పవార్‌ కుటుంబానికి కంచు కోట అయిన బారామతి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తన మరదలు, విపక్ష మహా వికాస్ అఘాదీ (ఎంవీఏ) కూటమి తరఫున నేషనలిస్ట్ కాంగ్రెస్ (శరద్ పవార్) పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే (Supriya Sule)పై ఆమె ఘోర ఓటమిపాలయ్యారు. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు విజయం సాధించిన సుప్రియా నాలుగోసారి కూడా జయకేతనం ఎగురవేశారు. తన వదినపై ఏకంగా 1.55 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో సుప్రియా సూలేకి 7,32,312 ఓట్లు పోలవగా.. సునేత్రకు 5,73,979 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత సునేత్ర రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.

ఇవి కూడా చదవండి :

Tamil Nadu State Film Awards | తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ 2026 .. ‘జై భీమ్’ సినిమా హ‌వా
Vastu Tips | దంప‌తులు ఒకే కంచంలో క‌లిసి తింటున్నారా..? ముద్దుమురిపెం క‌ష్ట‌మేన‌ట‌..!