కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపడుతుందని, ఇది దేశ ముఖ చిత్రాన్ని మార్చనుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కోన్నారు. ఆదివారం అలంపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు
రాజ్యాంగం మార్పు..రిజర్వేషన్ల రద్దుకు మోదీ ప్రయత్నం
22కుటుంబాల బాగు కోసమే మోదీ ఆలోచన
అలంపూర్ కాంగ్రెస్ జనజాతర సభలో రాహుల్గాంధీ
విధాత : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపడుతుందని, ఇది దేశ ముఖ చిత్రాన్ని మార్చనుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కోన్నారు. ఆదివారం అలంపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. . తెలంగాణలో కులగణన చేస్తున్నామని, కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దేశమంతా తప్పకుండా కుల గణన చేపడతామని ప్రకటించారు.
ఈ సర్వేతో దళితులు, ఓబీసీల ఆర్థిక పరిస్థితి తెలుస్తుందని, కుల గణనతో అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు .కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తామని ప్రకటించారు. కుల గణన ద్వారా రిజర్వేషన్లు 50 శాతం కంటే ఎక్కువ పెంచుతామని తెలిపారు. ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని రక్షించే ఇండియా కూటమికి, రాజ్యాంగ వ్యతిరేక ఎన్డీఏ కూటమికి మధ్య జరుగుతోన్న పోటీ అన్నారు. ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు హక్కులను రాజ్యాంగమే కాపాడుతోందని.. కాని ఆ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. అయితే రాజ్యాంగాన్ని ఎవరూ మార్చాలేరని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. సెంటర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేద కుటుంబాల జాబితాను తయారు చేస్తామని, పేద కుటుంబాలకు చెందిన మహిళ ఖాతాల్లో లక్ష రూపాయలు వేస్తామని హామీ ఇచ్చారు.
మహిళలకు ఆర్ధిక చేయూతనందిస్తామని, ఉపాధి హామీ పథకం రోజువారిగా 400చెల్లిస్తామన్నారు. పాంచ్ న్యాయ్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మోడీ ప్రభుత్వం దేశంలో సంపన్న వర్గాల కోసమే పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం దేశంలోని 22 కుటుంబాల బాగు కోసమే బీజేపీ పని చేస్తోందని ఆరోపించారు. దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచి పెడుతున్నారన్నారు. అదానీ, అంబానీకి చెందిన రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారు.. కానీ రైతులకు రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యునతికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.