కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వస్తే 50శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేసి, రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ హామీ ఇచ్చారు
కులగణన..ఆర్ధిక సర్వే జరిపిస్తాం
ఈ ఎన్నికలు రాజ్యాంగ రక్షకులకు..వ్యతిరేకులకు మధ్య సమరం
మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేస్తాం
అదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల ప్రచార సభలో రాహుల్గాంధీ
విధాత : కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వస్తే 50శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేసి, రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ హామీ ఇచ్చారు. ఆదివారం అదిలాబాద్ పార్లమెంటు అభ్యర్థి ఆత్రం సుగుణ ఎన్నికల ప్రచార సభలో రాహుల్గాంధీ ప్రసంగించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుందని, ఈ పార్లమెంటు ఎన్నికలో రాజ్యాంగం రక్షకులుగా ఉన్న కాంగ్రెస్ ఇండియా కూటమికి, రాజ్యాంగం వ్యతిరేకులుగా ఉన్న బీజేపీ ఎన్డీఏ కూటమికి మధ్య సాగుతున్న సమరమన్నారు. ఇండియా కూటమి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే సమూహమని పేర్కోన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని, ఆయన ఏనాడు కూడా రిజర్వేషన్ల పరిమితిని తొలగిస్తామని చెప్పలేదని ప్రజలు గమనించాలన్నారు. రిజర్వేషన్లను తొలగిండానికే మోదీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ఒక్కోక్కటిగా ప్రైవేటీకరణ చేస్తుందన్నారు. ప్రైవేటీకరణ అంటేనే రిజర్వేషన్లు తొలగించడమేనని రాహుల్ స్పష్టం చేశారు. పేదల హక్కులను తొలగించి ధనికులకు మేలు చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్ధికంగా సహాయం చేస్తామన్నారు. ఉపాధి హామీ పథకం కింద రోజుకు 400ఇస్తామన్నారు. ప్రతి గ్రాడ్యూయేట్కు ఉద్యోగ కల్పిస్తామన్నారు.
కులగణన..ఆర్ధిక సర్వే జరిపిస్తాం
భారత్ జోడో యాత్ర సందర్భంగా తాను దేశ వ్యాప్తంగా 4వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశానని, కోట్లాది మంది ప్రజలు నా వెంట నడిచారని రాహుల్గాంధీ గుర్తు చేశారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా కులగణన, ఆర్ధిక సర్వే జరిపిస్తామన్నారు. ఏ వర్గం వద్ద ఎంత సంపద ఉందో తెలుసుకుంటామన్నారు. తెలంగాణలో ఉన్న ప్రజాప్రభుత్వం మాదిరిగానే కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందన్నారు.
తెలంగాణలో విద్వేష బీజేపీని, బీఆరెస్ను ఓడించి ప్రజాపాలన స్థాపించినట్లుగానే కేంద్రంలో విద్వేష బీజేపీని ఓడించి ప్రేమ దుకాణాలను తెరుస్తామన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నామన్నారు. భూమిపై మొదటి హక్కులు కలిగివుండే వ్యక్తులు ఆదివాసీలని, వారికి తాము అన్ని హక్కులు కల్పిస్తామన్నారు. అదిలాబాద్లో ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని కోరారు.