Rain Alert | హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం బలహీనపడిన నేపథ్యంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
దీని ప్రభావంతో వచ్చే రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. శుక్రవారం నుంచి రాష్ట్రంలో రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వెల్లడించింది. గాలిలో తేమ తగ్గడం వల్ల చలిగాలుల తీవ్రత పెరుగుతుందని తెలిపింది.
ఏపీలో పిడుగులతో కూడిన వానలు..
ఇదిలాఉంటే.. ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
