అసెంబ్లీలో బడ్జెట్ సందర్భంగా జిల్లాల పునర్విభజనపై పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిల మధ్య చోటుచేసుకున్న సంవాదం జిల్లాల పునర్విభజన డిమాండ్ను తెరపైకి తెచ్చింది.
వైరల్ గా మారిన రాంమోహన్రెడ్డి తొడగొట్టిన వీడియో
విధాత, హైదరాబాద్ : అసెంబ్లీలో బడ్జెట్ సందర్భంగా జిల్లాల పునర్విభజనపై పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిల మధ్య చోటుచేసుకున్న సంవాదం జిల్లాల పునర్విభజన డిమాండ్ను తెరపైకి తెచ్చింది. ఎమ్మెల్యే రాంమోహన్రెడ్డి తన ప్రసంగంలో జిల్లాల విభజన సహేతుకంగా సాగలేదని, రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్ జిల్లా ఏర్పాటు చేసి వెనుకబాటు ప్రాంతంగా చిత్రీకరించారని, ఉద్యోగ జోన్లలో మా జిల్లాను జోగులాంబ జిల్లాలో కలిపి బీఆరెస్ ప్రభుత్వం అన్యాయం చేయచూసిందని, ప్రజా ఉద్యమంతో తిరిగి హైదరాబాద్ చార్మినార్ జోన్లో కలిపిందన్నారు. వికారాబాద్ జిల్లాకు రావాల్సిన నీళ్లను కొండపోచమ్మకు మళ్లించారని ఆరోపించారు.
దీనిపై మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ వికారాబాద్ జిల్లాను రంగారెడ్డి జిల్లాలో కలపాలన్నట్లుగా రాంమోహన్రెడ్డి మాట్లాడారని అభ్యంతరం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా కావాలన్న డిమాండ్తో అక్కడి ప్రజలు 30ఏళ్లుగా చేసిన పోరాటాలను గుర్తించి మాజీ సీఎం కేసీఆర్ జిల్లాను ఏర్పాటు చేశారన్నారు. జిల్లా ఏర్పాటు చేయడంతో గతంలో మాదిరిగా రంగారెడ్డి వరకు రాకుండా వికారాబాద్ జిల్లాలోనే ప్రజలు తమ సమస్యలు పరిష్కరించుకుంటున్నారన్నారు. జిల్లా ఏర్పాటైనందునే అక్కడ కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ వంటి సదుపాయలేన్నో ఏర్పడ్డాయన్నారు. ఎమ్మెల్యే రాంమోహన్రెడ్డి ఆలోచననే ఆ జిల్లాకు చెందిన వికారాబాద్ ఎమ్మెల్యేగా మీరు ఏకీభవిస్తున్నారా స్పష్టం చేయాలని స్పీకర్ ప్రసాద్ను కోరారు.
అయితే శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు స్పందిస్తూ స్పీకర్ సభకు మొత్తం ప్రాతినిధ్యం వహిస్తారని, ఆయనను ఈ చర్చలో ప్రతిస్పందించాలని కోరడం నిబంధనలకు వ్యతిరేకమన్నారు. ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి ఉద్ధేశం జిల్లాల విభజన శాస్త్రీయంగా జరుగలేదని మాత్రమే అన్నారన్నారు. తిరిగి దీనిపై మాట్లాడిన రాంమోహన్రెడ్డి జిల్లాల విభజన శాస్త్రీయంగా జరుగలేదని, మండలాలు, జిల్లాల ఏర్పాటులో శాస్త్రీయ ప్రమాణాలు లేకుండా జనాభా హెచ్చుతగ్గుదలతో విభజించారన్నారు. అందుకే జిల్లాలు, మండలాల ఏర్పాటుపై జ్యుడిషియల్ కమిటీ వేయాలని, 40-50వేల మందికో మండలం, ఏడు నియోజకవర్గాలు లేక పార్లమెంటు ప్రాతిపదికనైనా జిల్లాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకోసం అసెంబ్లీలో చర్చ పెట్టి, అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్లాలన్నారు.
అసెంబ్లీలో తొడగొట్టిన పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి
రాష్ట్ర బడ్జెట్పై కాంగ్రెస్ నుంచి మాట్లాడిన పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి అన్ని రంగాలకు, అన్ని ప్రాంతాలకు మంచి పనులు చేస్తున్న మా ప్రభుత్వానికి బీఆరెస్ ఎమ్మెల్యేలు సహకరించాలని కోరారు. కాని ప్రభుత్వాన్ని పడగొడతాం..పడగొడతాం అంటే మేము తొడ గొట్టాడానికి సిద్ధంగా ఉన్నామంటూ తొడగొట్టి మరి సవాల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.