ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రికార్డు నెలకొల్పింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన అన్నదాతలకు మూడు రోజుల వ్యవధిలోనే డబ్బులు చెల్లించింది.
రూ.10,355.18 కోట్ల చెల్లింపులు
హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రికార్డు నెలకొల్పింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన అన్నదాతలకు మూడు రోజుల వ్యవధిలోనే డబ్బులు చెల్లించింది. ఇప్పటివరకు 8,35,109 మంది రైతులకు రూ.10355.18 కోట్లు చెల్లింపులు చేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను కూడా ముందుగా ప్రారంభించింది. గతంలో ఏప్రిల్ నెలలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యేవి. ఈసారి దాదాపు రెండు వారాలు ముందుగా మార్చి 25వ తేదీ నుంచే కొనుగోళ్లు ప్రారంభించింది. రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 7178 ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచింది.
వీటిలో 6345 కేంద్రాల్లో కొనుగోళ్లు జరిగాయి. ఈ నెల 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 47.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. చాలాచోట్ల ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయిందని, మరో పది రోజుల పాటు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశముందని పౌర సరఫరాల విభాగం అంచనా వేస్తోంది. ఆలస్యంగా పంటలు వేసిన రైతులకు ఇబ్బంది తలెత్తకుండా.. ఈ నెలాఖరు వరకు అవసరమైన చోట్ల కేంద్రాలు తెరిచి ఉంచాలని అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది దాదాపు 75.40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోళ్లు జరుగుతాయని సివిల్ సప్లయిస్ విభాగం మొదట్లో అంచనా వేసింది.
కానీ మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ రేటు రావటం, ప్రైవేటు వ్యాపారులు పోటీ పడి మంచి ధరకు కొనుగోలు చేయటంతో కేంద్రాలకు వచ్చే ధాన్యం అంచనా తగ్గింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఈసారి సివిల్ సప్లయిస్ విభాగం పక్కాగా ఏర్పాట్లు చేసింది. అందుకే ఈదురు గాలులు, అకాల వర్షాలకు కూడా రైతులు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు చేపట్టింది. ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు వెనుకాడలేదు. ఈసారి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్ధిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, జనగామ జిల్లాలు ముందంజలో ఉన్నాయి.