ప్రధాని పదవిలో ఉండి విద్వేశ రాజకీయాలు
ముస్లింలను అవమానించడానికి మోదీకి ఎంత దమ్ము
రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
విధాత, హైదరాబాద్: రాజ్యసభ ఎంపీ రేణుక చౌదరి సోమవారం ప్రధానీ మోదీ, బీఆరెస్ అధినేత కేసీఆర్పై మండిపడ్డారు. కేసీఆర్కు డోస్ ఎక్కువై ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. బీఆరెస్ నేతలకు మా అభ్యర్థుల విషయం ఎందుకని దుయ్యబట్టారు. ఖమ్మం పాలించడం వస్తే దేశాన్ని పాలించే అనుభవం వస్తుందని, ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయమంటే చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి మోదీ గ్యారెంటీలకు వారంటీ అయిపోయింది, అందుకే ఆయనకు ఓటమి భయం పట్టుకుందన్నారు. హిందూ మహిళల మాంగల్యాలను ముస్లింలు తీసుకెళ్తారని మోదీ రెచ్చ గొడుతున్నాడు, దేశ ప్రధాని ఇంత విద్వేశాన్ని వెదజిల్లుతుంటే ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని ఎదురు చూస్తున్నానన్నారు. దేశ మహిళలను మోదీ అవమాన పరిచాడని రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. దేశంలోని ముస్లింలను అవమాన పరచడానికి మోదీకి ఎంత దమ్ము?, మంగళ సూత్రాలు ఇచ్చినా తీసుకునే ముస్లింలు ఎవరూ లేరన్నారు. మోదీ కట్టిన తాళి తన భార్యకి ఉరితాడుగా మారిందని ఆమె వెల్లడించారు. మోదీకీ రాజ్యాంగం గురించి, దేశ చరిత్ర గురించి ఏ మాత్రం తెలియదన్నారు. టెర్రరిజం, విద్వేషం కేవలం ఒక మతానికి సంబంధించింది కాదు, అన్ని మతాల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేవాళ్ళు ఉంటారని రేణుకా చౌదరి తెలిపారు.