విధాత, హైదరాబాద్ : మొంథా తుపాన్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోనూ భారీ వర్ష సూచనల నేపథ్యంలో రాష్ట్రంలో ధాన్యం, పత్తి, మొక్క జొన్న కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టం జరగకుండా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని అదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో వానకాలం వరి పంటల కోతలు, ధాన్యం కొనుగోలు జోరుగా సాగుతున్నాయి. అటు పత్తి, మొక్కజొన్న పంటల దిగుబడులు కూడా కొనుగోలు కేంద్రాలకు వస్తుండటంతో తుపాన్ వర్షాలు రైతాంగాన్ని భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కీలకంగా మారాయి.
