కవిత నిర్ధోషిగా బయటకొస్తారు.. రాజకీయ కోణంలోనే లిక్కర్‌ కేసు: ఆరెస్‌ ప్రవీణ్‌కుమార్‌

ఢిల్లీ లిక్కర్‌ కేసులో బీఆరెస్‌ ఎమ్మెల్సీ కవిత నిర్ధోషిగా బయటకొస్తారని, రాజకీయ కక్ష సాధింపు కోణంలోనే ఆమెపై బీజేపీ లిక్కర్‌ కేసు మోపిందని బీఆరెస్‌ నేత ఆరెస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు

  • Publish Date - May 17, 2024 / 04:20 PM IST

విధాత: ఢిల్లీ లిక్కర్‌ కేసులో బీఆరెస్‌ ఎమ్మెల్సీ కవిత నిర్ధోషిగా బయటకొస్తారని, రాజకీయ కక్ష సాధింపు కోణంలోనే ఆమెపై బీజేపీ లిక్కర్‌ కేసు మోపిందని బీఆరెస్‌ నేత ఆరెస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శుక్రవారం బాల్క సుమన్‌తో కలిసి ఆరెస్‌ ప్రవీణ్ కమార్ ములాఖత్ అయ్యారు. అనంతరం ప్రవీణ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. జైల్లో కవిత చాలా ధైర్యంగా ఉన్నారని, నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే నమ్మకంతో ఉన్నారని తెలిపారు.

రాజకీయ దురుద్దేశంతోనే కవితపై కేసు పెట్టారని విమర్శించారు. కవిత దగ్గరనుంచి ఒక్క రూపాయి డబ్బు దొరకలేదని చెప్పారు. లంచం డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేవని.. అలాంటప్పుడు అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. వాళ్ళ పేర్లు, వీళ్ల పేర్లు చెప్పండి అంటూ కవితపై అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లుగా కవిత చెప్పారని తెలిపారు. ఈడీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బీజేపీలో చేరినవారిపై ఒకలా, చేరనివారిపై మరోలా సెలెక్టివ్‌గా ఈడీ వ్యవహరిస్తోందని విమర్శించారు.

విపక్షాల గొంతు నొక్కేందుకు సీబీఐ, ఈడీని బీజేపీ వాడుకుంటుందన్నారు. లాయర్‌కు నోటీసులు ఇవ్వకుండా కవితను సీబీఐ అరెస్టు చేయడమంటనే కేసు ఎంత దారుణంగా ఉన్నారో అర్ధం అవుతుందన్నారు. రాత్రికి రాత్రి జడ్జిని మార్చారని గుర్తుచేశారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆయా ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తాయని, అందులో ఉన్నవాళ్ళందరిని దోషులుగా చేరుస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు. రైతు చట్టాలు సహా అనేక పాలసీలు మోడీ తీసుకొచ్చారని మరి అవి ఎవరి ప్రయోజనాలకోసం తీసుకొచ్చారని ప్రశ్నించారు.

Latest News