బీజేపీ-ఆరెస్సెస్లు రిజర్వేషన్లను రద్దు చేస్తాయన్నప్రచారంపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టత నిచ్చారు. రిజర్వేషన్లకు ఆరెస్సెస్ వ్యతిరేకం కాదని, తొలి నుంచి
రాజకీయ స్వార్థంతో మాపై దుష్ప్రచారం
విధాత, హైదరాబాద్ : బీజేపీ-ఆరెస్సెస్లు రిజర్వేషన్లను రద్దు చేస్తాయన్నప్రచారంపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టత నిచ్చారు. రిజర్వేషన్లకు ఆరెస్సెస్ వ్యతిరేకం కాదని, తొలి నుంచి రాజ్యాంగం నిర్ధేశించిన అన్ని రిజర్వేషన్లకు సంఘ్పరివార్ మద్దతుగా నిలుస్తోందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నాదర్గుల్ విద్యాభారతి విజ్ఞాన కేంద్రం ప్రారంభత్సోవానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఆరెస్సెస్ రిజర్వేషన్లకు వ్యతిరేకమని కొందరు సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలతో దుష్ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం అమల్లో ఉన్న రిజర్వేషన్లకు తామెన్నడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని మోహన్ భగవత్ పేర్కొన్నారు. అవసరమైనంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు. రాజకీయ స్వార్ధంతో రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఆరెస్సెస్పై తప్పుడు విమర్శలు చేస్తున్నారని, ఇదంతా దుష్ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. ఎన్నికల వేళ వివాదం సృష్టించి లబ్దిపొందాలని చూస్తున్నారన్నారు. ఎవరికోసం అయితే రిజర్వేషన్లు కేటాయించబడ్డాయో వారు అభివృద్ధి చెందేవరకు రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని తేల్చి చెప్పారు.