విధాత: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించిన మేడ్చల్ మల్కాజిగిరి ప్రెసిడెంట్ నందికంటి శ్రీధర్ బుధవారం తన అనుచరులతో కలిసి బీఆరెస్ పార్టీలో చేరారు. బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో నందికంటి బీఆరెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతగానో కష్టపడి పని చేశామని, చమట, రక్తం ధారాపోసినా తగిన స్థానం, గుర్తింపు లేకుండా పోయిందన్నారు.
కాంగ్రెస్ పార్టీలో బీసీలకు స్థానం లేదని అర్ధమైన తర్వాత ఆ పార్టీని వీడి బీఆరెస్లో చేరినట్లుగా తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు ఈరోజు బీఆరెస్లో చేరడం జరిగిందన్నారు.
మల్కాజిగిరి బీఆరెస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు కాంగ్రెస్లో చేరగా, వారికి మల్కాజిగిరి, మెదక్ టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఆయా స్థానాల్లో టికెట్లు ఆశించిన నందికంటి శ్రీధర్తో పాటు మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డిలు కాంగ్రెస్ పార్టీకి గుడ్బై కొట్టారు.