Supreme Court phone tapping case| ఎంతకాలం విచారించాలి: ఫోన్ టాపింగ్ కేసులో సుప్రీం కోర్టు అసహనం

ఫోన్ టాపింగ్ కేసు విచారణ అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇంకా ఎంతకాలం ఈ పిటిషన్ పైన విచారణ జరపాలి అని న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్నం, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభాకర్ రావుకు మంజూరు చేసిన మధ్యంతర రక్షణ బెయిల్ మార్చి 10 వరకు కొనసాగుతుందని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jan 16, 2026, 2:33 pm IST
Read Time: 5 mins
Supreme Court phone tapping case| ఎంతకాలం విచారించాలి: ఫోన్ టాపింగ్ కేసులో సుప్రీం కోర్టు అసహనం

విధాత: ఫోన్ టాపింగ్ కేసు విచారణ అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇంకా ఎంతకాలం ఈ పిటిషన్ పైన విచారణ జరపాలి అని న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్నం,  ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణలో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు కోర్టు ఆదేశాల మేరకు విచారణకు సహకరించాడు కదా అని, మీకు వేరే ఉద్దేశాలు ఉంటే మేము ప్రోత్సహించలేము అని.. ప్రభాకర్ రావును జైల్లో ఉంచాలనేదే మీ ఆలోచనగా ఉన్నట్లుగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ప్రభాకర్ రావు ను మీరు విచారణకు అడిగితే విచారణకు సహకరించమని చెప్పాము అని, అతడు కూడా విచారణకు సహకరించాడని..మరింత విచారణ అవసరం అనుకుంటే మళ్ళీ విచారణకి పిలిచి ప్రశ్నించవచ్చు కదా అని..మేం కూడా సహకరించమని చెప్తాము అని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభాకర్ రావుకు మంజూరు చేసిన మధ్యంతర రక్షణ బెయిల్ మార్చి 10 వరకు కొనసాగుతుందని సుప్రీంకోర్టు ఆదేశించింది.

తెలంగాణ ప్రభుత్వం తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాతో పాటు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కోర్టు మునుపటి ఆదేశాల ప్రకారం రావు లొంగిపోయినప్పటికీ, కొనసాగుతున్న దర్యాప్తుకు సహకరించడం లేదని వాదించారు. మావోయిస్టుల అంశాలను ట్రాక్ చేసే ముసుగులో లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులపై ప్రభాకర్ రావు అక్రమ నిఘా నిర్వహించారని ఎస్.జి. మెహతా ఆరోపించారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ కొన్ని డిజిటల్ ఖాతాలకు యాక్సెస్ కల్పించడంతో సహా మునుపటి కోర్టు ఆదేశాలను ఇంకా పూర్తిగా పాటించలేదని కూడా ఆయన ఎత్తి చూపారు. పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించిన వ్యక్తి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొనసాగించలేడని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.ఇది గోప్యతకు తీవ్ర ఉల్లంఘన, జాతీయ భద్రతకు సంబంధించిన కీలక కేసుగా అభివర్ణించారు.

తాజాగా సుప్రీంకోర్టు ఇదే కేసులో తెలంగాణ ప్రభుత్వం మాజీ మంత్రి టి.హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులపై దాఖలు చేసిన రెండు పిటిషన్లను కొట్టివేసింది. వారిద్దరికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ బీవీ నాగరత్న ధర్మాసనం విచారణ చేపట్టింది. గతంలో హరీశ్‌, రాధాకిషన్‌పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు క్వాష్‌ చేసింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం స్పందిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.