తెలంగాణ అవతరణ ఉత్సవాలకు వేళాయే

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సీఎం ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు.

  • Publish Date - May 30, 2024 / 09:56 PM IST

  • తెలంగాణ అవతరణ ఉత్సవాలకు వేళాయే
  • జూన్ 2న గన్ పార్కు అమరవీరుల స్థూపం వద్ద సీఎం నివాళి
  • 10గంటలకు పెరేడ్ గ్రౌండ్‌లో సీఎం జాతీయ పతకావిష్కరణ
  • తెలంగాణ గేయం ఆవిష్కరణ
    అనంతరం సోనియాగాంధీ, సీఎం ప్రసంగాలు
  • అవార్డుల ప్రధానోత్సవం
  • సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై సంబరాలు
  • 700మంది కళకారుల ప్రదర్శనతో కార్నివాల్‌
  • భారీ ఫ్లాగ్ వాక్‌
  • జయజయహే తెలంగాణ పూర్తి గేయం ఆవిష్కరణ
  • అందేశ్రీ, కీరవాణీలకు సన్మానం
  • భారీ బాణసంచాతో ముగింపు

విధాత, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సీఎం ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం వేడుకల నిర్వాహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఏర్పాట్లు చేపడుతుంది. వేడుకలను ఈ దఫా ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. జూన్ 2న ఉదయం 9.30కు గన్ పార్క్‌ అమర వీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు సికింద్రామాద్‌ పెరేడ్ గ్రౌండ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పేరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. అనంతరం తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రత్యేక అతిధి, రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీ ప్రసంగం, సీఎం రేవంత్ రెడ్డి సందేశం ఉంటుంది.
అనంతరం పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు గ్రహిలతో ఫోటో సెషన్ అనంతరం కార్యక్రమం ముగుస్తుంది.

సాయంత్రం ట్యాంక్ బండ్‌పై సంబరాలు
జూన్ 2 సాయంత్రం ట్యాంక్ బండ్‌పై తెలంగాణ ఆవిర్భావ సంబరాలు ప్రారంభమవుతాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6.30కు ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్ కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. అనంతరం ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. స్టేజ్​ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్​ బండ్​పై ఇటు చివర నుంచి అటు చివరి వారకు భారీ ఫ్లాగ్​ వాక్​ నిర్వహిస్తారు. దాదాపు 5 వేల మంది ఇందులో పాల్గొంటారు. ఈ ఫ్లాగ్​ వాక్​ జరుగుతున్నంత సేపు జయ జయహే తెలంగాణ ఫుల్​ వర్షన్ (13.30 నిమిషాల) గీతాన్ని విడుదల చేస్తారు. అదే వేదికపై తెలంగాణ కవి శ్రీ అందెశ్రీ, సంగీత దర్శకుడు శ్రీ ఎం.ఎం. కీరవాణికి సన్మానం చేస్తారు. రాత్రి 8.50 గంటలకు పది నిమిషాల పాటు హుస్సేన్ సాగరం మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణాసంచా (ఫైర్వర్క్స్) కార్యక్రమంతో వేడుకలను ముగిస్తారు.

Latest News