HCU విద్యార్థులపై వెంటనే కేసులు ఉపసంహరించండి

HCU విద్యార్థులపై వెంటనే కేసులు ఉపసంహరించండి

పోలీసు అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం

HCU : హైద‌రాబాద్‌, ఏప్రిల్ 7(విధాత‌): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో Hcu టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్ తో సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు దుదిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి చర్చల తదుపరి డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. కేసుల ఉపసంహరణ క్రమంలో ఎటువంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీస్ అధికారులకు తగు సూచనలు చేయవలసిందిగా న్యాయశాఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచె గచ్చిబౌలి సమస్యపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల సబ్ కమిటీ సమావేశం సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు మంత్రులు దుదిల్లా శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి శ్రీమతి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచందర్ రెడ్డి లు పాల్గొన్నారు. సబ్ కమిటీతో హైదరాబాద్ విశ్వవిద్యాలయ ఉపాధ్యాయ సంఘం (UHTA),  పౌర సంఘాల ప్రతినిధులు సమావేశమై పలు డిమాండ్లను మంత్రుల కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.

1. HCU క్యాంపస్ నుండి పోలీసు బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలి మరియు నిషేధాజ్ఞలను వెనక్కి తీసుకోవాలి.
2. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై ఇటీవల నమోదు చేసిన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలి. మరియు ఇప్పటికీ పోలీసు కస్టడీలో ఉన్న ఇద్దరు విద్యార్థులను వెంటనే విడుదల చేయాలి.
3. కేంద్ర సాధికార కమిటీ క్యాంపస్‌ను సందర్శించే ముందు 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిలో నష్టం అంచనా మరియు జీవవైవిధ్య సర్వే నిర్వహించడానికి నిపుణులైన అధ్యాపకులు, పరిశోధకులకు అనుమతి ఇవ్వాలి.
పైన పేర్కొన్న తక్షణ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చక పోవడంతో విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ  ఈ సమావేశానికి హాజరు కాలేదని UHTA, సివిల్ సొసైటీ ప్రతినిధులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. పైన పేర్కొన్న తక్షణ డిమాండ్లు నెరవేర్చిన తర్వాతే విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మంత్రుల కమిటీ నిర్వహించే సమావేశానికి హాజరవుతారని వారు తెలిపారు.
UHTA, సివిల్ సొసైటీ ప్రతినిధుల డిమాండ్లను పరిశీలించిన తదుపరి త్రిసభ్య మంత్రుల కమిటీ ఇలా పేర్కొంది:
1. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం, పేర్కొన్న 400 ఎకరాల భూమిని రక్షించడానికి పోలీసుల పహారా తప్పనిసరి.
2. క్యాంపస్‌ లోని మిగిలిన ప్రాంతాల నుండి పోలీసులను ఉపసంహరించుకోవాలనే అంశం గురించి ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు ప్రభుత్వం నుంచి లేఖ రాస్తాము. విద్యార్థులు, వసతి గృహాల భద్రత గురించి వీసీ హామీ ఇచ్చిన తర్వాత, 400 ఎకరాల్లో మినహా, క్యాంపస్ నుండి పోలీసులను ఉపసంహరించుకుంటాం.
3. విద్యార్థులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌కు సంబంధించి, HCU విద్యార్థులపై దాఖలైన కేసుల పట్ల సానుభూతితో కూడిన దృక్పథానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. అంతే కాకుండా, సాధ్యమైనంత త్వరగా కేసుల ఉపసమహారణకు పోలీసు శాఖ/న్యాయ శాఖతో సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకుంటాం
4. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని దృష్టిలో ఉంచుకుని, తదుపరి కోర్టు ఆదేశాలు జారీ చేసే వరకు అధ్యాపకులు మరియు విద్యార్థులు సహా ఎవరిని 400 ఎకరాల్లో సర్వేకు అనుమతించలేము
5. విద్యార్థులు కోరిన విధంగా యూనివర్సిటీని సందర్శించడానికి కమిటీ అనుకూలంగా ఉంది, కానీ సుప్రీంకోర్టులో కేసు  కొనసాగుతున్న దృష్ట్యా న్యాయపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికిప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మంత్రుల బృందం రాలేదు. అయితే ఈ విషయంపై  విద్యార్థుల సూచనలు, సలహాలు వినడానికి  మంత్రుల కమిటీ సిద్ధంగా ఉంది.
ఈ సమావేశంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ప్రొఫెసర్ సౌమ్య దేచమ్మ CC, ప్రొఫెసర్ శ్రీపర్ణ దాస్, ప్రొఫెసర్ భంగ్య భూక్య, పౌర సంఘాల ప్రతినిధులు విస్సా కిరణ్‌కుమార్, NAPM,  V.సంధ్య, WTJAC K.సజయ, WTJAC, ఇమ్రాన్ సిద్ధిఖీ, CWS-ఇండియా తదితరులు పాల్గొన్నారు