Ration Rice | హైదరాబాద్ : తెల్ల రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వచ్చే జనవరి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
గురువారం మధ్యాహ్నం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ సమావేశం జరిగింది. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పౌరసరఫరాల శాఖా కార్యదర్శి డీఎస్ చవాన్లతో పాటు వైద్యారోగ్య, ఉన్నత విద్య, బీసీ సంక్షేమ, ఎస్సీ సంక్షేమ, గిరిజన సంక్షేమ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తదితర మొత్తం ఎనిమిది శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పీడీఎస్ బియ్యం దారి తప్పితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. పీడీఎస్ బియ్యం పట్టుబడితే తక్షణమే డీలర్ షిప్ రద్దు ఉంటుందన్నారు. అదే సమయంలో రేషన్ షాప్ డీలర్ల ఆదాయం పెంపు దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రయత్నం చేస్తామన్నారు. అంతేగాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న1629 చౌక ధరల దుకాణాల డీలర్ల భర్తీకి వెంటనే ఉపక్రమించాలన్నారు.
ప్రభుత్వ వసతి గృహాలతో పాటు అంగన్వాడీ, మధ్యాహ్న భోజనాలలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు. తరచూ తనిఖీలు నిర్వహిస్తుంటే మార్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా లబ్ధిదారులకు వంటగ్యాస్కు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీపై లబ్ధిదారులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సబ్సిడీ మొత్తం లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యే విషయాన్ని వారికి ప్రస్ఫుటంగా చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.