TG Tenth Results | హైద‌రాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు( TG Tenth Results ) ఒక‌ట్రెండు రోజుల్లో విడుద‌ల కానున్నాయి. రేపు లేదా ఎల్లుండి ప‌ది ఫ‌లితాల‌ను విడుద‌ల చేసేందుకు విద్యాశాఖ( Education Department ) అధికారులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఇక పదో తరగతిలో ఈ సారి మార్కుల మెమో( Marks Memo )లపై సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు( Grades ) ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. గత సంవత్సరం వరకు పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడింగ్‌తో పాటుగా క్యుములేటివ్‌ గ్రేడింగ్‌ పాయింట్‌ యావరేజ్‌ ( CGPA ) ఇచ్చేవారు.

ఇక నుంచి పదో తరగతి మెమోల్లో సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. జీపీఏ అనేది తీసివేయనున్నారు. మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడు పొందుపరచనున్నారు. చివరగా విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్‌ అయ్యారా? అనేది వివరంగా ఇస్తారు. ఇంకా బోధనేతర కార్యక్రమాల(కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌)లో స్టూడెంట్స్‌కు గ్రేడ్లు ఇస్తారు. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4 వరకు ప‌దో త‌ర‌గ‌తి వార్షిక పరీక్షలు జరగ్గా.. 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు.