telangana handloom workers national award | కేంద్ర చేనేత, జౌళి శాఖ ప్రకటించిన జాతీయ చేనేత పురస్కారం-2024కి తెలంగాణకు చెందిన ఇద్దరు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందనలు తెలియజేశారు. దేశ వ్యాప్తంగా 19 మంది చేనేత కార్మికులు ఎంపిక కాగా, వారిలో మన తెలంగాణ నుంచి ఇద్దరికి పురస్కారాలు దక్కడం గర్వకారణమని మంత్రి తుమ్మల ఆనందం వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం, పుట్టపాక గ్రామానికి చెందిన గజం నర్మద చేనేత వస్త్రాల మార్కెటింగ్ విభాగంలో 8కోట్ల టర్నోవర్ చేసినందుకు ఆమెకు ఈ పురస్కారం లభించింది.
సహజ రంగులను ఉపయోగించి జీఐ ట్యాగ్ పొందిన తేలియా రుమాల్ డిజైన్తో పట్టుచీరను నేసిన గూడ పవన్ జాతీయ చేనేత అవార్డు కు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో వారిద్దరు ఆదర్శంగా నిలిచారని మంత్రి తెలిపారు. చేనేత కార్మికులను తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా చేయూతనివ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే ఇటీవల చేనేత కార్మికుల కోసం రుణమాఫీ ప్రకటించి, 33 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. రాష్ట్ర చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడానికి ప్రత్యేక లేబుల్ ఏర్పాటు చేశామన్నారు మంత్రి. చేనేత కార్మికుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేతన్న భరోసా పథకాన్ని అమలు చేస్తున్నదని మంత్రి తుమ్మల వెల్లడించారు.