• Telugu News
  • /Telangana

Telangana | పంచాయతీ ఎన్నికలపై కీలక అప్టేట్.. ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే పంచాయతీల్లో ఓటరు జాబితా మరోసారి సవరణకు ఎస్‌ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. రేపటి నుంచి నవంబర్ 23 వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని తెలిపింది.

Reported by: chinna | తెలంగాణ‌ | Nov 19, 2025, 10:20 pm IST
Read Time: 4 mins
Telangana | పంచాయతీ ఎన్నికలపై కీలక అప్టేట్.. ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల

విధాత, హైదరాబాద్ :
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే పంచాయతీల్లో ఓటరు జాబితా మరోసారి సవరణకు ఎస్‌ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. రేపటి నుంచి నవంబర్ 23 వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని తెలిపింది. ఈ నెల 20న ఓటర్ల దరఖాస్తులు, తప్పుల సవరణ, అభ్యంతరాల స్వీకరణ, ఈ నెల 21న ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం, 23న తుది ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాల ప్రచురణ ఉంటుందని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని ఆదేశాలు జారీ చేశారు.

కాగా, రాష్ట్రంలో వచ్చే నెల రెండో వారంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. అదే నెలాఖరులోపు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే ఛాన్స్ ఉంది. వచ్చే నెల 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాల తరువాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు మంత్రి మండలి నిర్ణయం నేపథ్యంలో ఈ ప్రక్రియపై తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాయి. సోమవారం మంత్రిమండలి భేటీలో స్థానిక ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరిగింది. రిజర్వేషన్ల అమలు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు, న్యాయ నిపుణుల సలహాలపై పంచాయతీరాజ్‌శాఖ నివేదిక ఇచ్చింది దానిపై మంత్రులు తమ అభిప్రాయాలను తెలిపారు.

కాగా, పాత రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. చట్ట పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కాలేని నేపథ్యంలో పాత రిజర్వేషన్లతోనే తెలంగాణ సర్కార్ సర్పంచ్ ఎన్నికలను నిర్వహించనుంది. అయితే, కాంగ్రెస్.. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మద్ధతుతో పోటీ చేసే స్థానాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించనుంది.