విధాత, హైదరాబాద్: మార్చి నాటికి భూ భారతి కొత్త పోర్టల్ అందుబాటులోకి వస్తుందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్, సర్వే- ల్యాండ్ రికార్డ్స్ విభాగాలను భూభారతి పోర్టల్లో ఒకే గొడుగు కిందకు తీసుకువస్తున్నామనన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు, పారదర్శకంగా ఉండేలా ఈ పోర్టల్ను రూపొందించామని వెల్లడించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, దేవాదాయ, అటవీ, వక్ప్ భూములు తదితర అన్ని వివరాలు కనిపించేలా పోర్టల్లో పొందుపరిచామని తెలిపారు. మంగళవారం నాంపల్లిలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ( ట్రెస్సా) 2026 డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రిమాట్లాడుతూ ఆనాటి ప్రభుత్వ పదేళ్ల పాలనలో రెవెన్యూ వ్యవస్ధలో ఎదుర్కొన్న సమస్యల నుంచి విముక్తి లభిస్తుందనే నమ్మకంతో తెలంగాణ ప్రజానీకం ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదేళ్ల కాలంలో భ్రష్టు పట్టిన రెవెన్యూ వ్యవస్ధను ఒక్కో మెట్టు పేర్చుకుంటూ గ్రామ స్ధాయి వరకు బలోపేతం చేశామన్నారు. ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని ఇంకా చేయాల్సింది ఎంతో ఉందన్నారు. తెలంగాణ రైతుల భూములకు సంబంధించి గుండెకాయలాంటి సర్వే విభాగాన్ని పటిష్టపరుస్తున్నామని ఇందులో భాగంగా ఇప్పటికే 3500 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకోవడం జరిగిందని వారం రోజుల్లో మరో మూడువేల మందిని తీసుకోబోతున్నామని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తమ ప్రభుత్వం అర్ధం చేసుకుందని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక ఇబ్బందుల వల్లే కొంత ఆలస్యం జరుగుతుందని ప్రభుత్వం తరపున ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన అన్ని ప్రయోజనాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రెస్సా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగా రవీందర్ రెడ్డి, గౌతమ్ కుమార్, కోశాధికారి రమణారెడ్డి, కల్చరల్ డైరెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, టిఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాస్, జగదీష్, ఆర్డీవో ఉపేందర్ రెడ్డి జిహెచ్ఎంసీ జోనల్ కమీషనర్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Tamil Nadu NDA Differences | తమిళనాడులో ఎన్డీఏకు గడ్డు పరిస్థితులు.. అమిత్షా, పళనిస్వామి భిన్న ప్రకటనలు
Sonia Gandhi Health | సోనియా గాంధీకి తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్కు తరలింపు
