విధాత : దేశవ్యాప్తంగా సైబర్ మోసాల కేసులలో తెలంగాణ రాష్ట్రం టాప్ లో ఉంంది. 2024లో 29,758 సైబర్ మోసాల కేసులు నమోదుకాగా..అత్యధికంగా తెలంగాణలో 18,922 కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో బీహార్ (4,020), మహారాష్ట్ర (2,827), ఒడిశా (1,546) నిలిచాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ మేరకు రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అయితే సైబర్ నేరాల్లో ఎంత డబ్బు కోల్పోయారు లేదా ఎంత రికవరీ చేశారనే పూర్తి సమాచారాన్ని ఎన్సీఆర్బీ ప్రత్యేకంగా నిర్వహించదని మంత్రి స్పష్టం చేశారు.
సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C)ని ఏర్పాటు చేసిందని మంత్రి బండి సంజయ్ తెలిపారు. ‘సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్’ (CFCFRMS) ద్వారా 2026 జూన్ 30 నాటికి సుమారు 32.80 లక్షల ఫిర్యాదులకు సంబంధించి రూ.11,158 కోట్లకు పైగా బాధితుల సొమ్ము కాపాడగలిగినట్లు ఆయన పేర్కొన్నారు.
పెరుగుతున్న సైబర్ నేరాలు..
ప్రతి ఏటా సైబర్ నేరాలు పెరుగిపోతున్నట్లుగా కేంద్రం పేర్కోంది. 2020లో దేశవ్యాప్తంగా 10,395 కేసులు నమోదు కాగా 2021లో 14,007 కేసులు, 2022లో 17,470, 2023లో 19,466, 2024లో 29,758 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. సైబర్ నేరాల్లో అత్యధికంగా ఆన్లైన్ బ్యాకింగ్ ఫ్రాడ్స్ అత్యధికంగా ఉన్నట్లు తెలిపింది. 2024లో ఆన్లైన్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్ కేసులు 4,659 నమోదు కాగా, క్రెడిట్/డెబిట్ కార్డ్ మోసాలు 3,829, మార్కెటింగ్/పెట్టుబడుల పేరిట మోసాలు 3,044, ఏటీఎం మోసాలు 1,659, ఫేక్ కాల్స్/విషింగ్ 1,264, గేమింగ్ యాప్స్/వెబ్సైట్ మోసాలు 1,019, ఓటీపీ ఫ్రాడ్స్ 965, ఈ-వాలెట్/యూపీఐ మోసాలు 723 నమోదైనట్లు వెల్లడించింది.
