JAC of Telangana Employees | 15 రోజుల్లో మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం.. కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఫైర్

కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి 9 నెల‌లు అవుతుంది.. కానీ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క‌టి కూడా అమ‌లు కాలేద‌ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ మండిప‌డింది

JAC of Telangana Employees | 15 రోజుల్లో మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం.. కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఫైర్

విధాత : కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి 9 నెల‌లు అవుతుంది.. కానీ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క‌టి కూడా అమ‌లు కాలేద‌ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ మండిప‌డింది. 15 రోజుల్లో మా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తేల్చిచెప్పింది. ఇవాళ హైద‌రాబాద్‌లో అన్ని ఉద్యోగ సంఘాల ఆధ్వ‌ర్యంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఏర్పడింది. ఈ సమావేశానికి 53 ఉద్యోగ సంఘాలు హాజరయ్యాయి. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్ర‌తినిధులు మీడియాతో మాట్లాడారు.
ఇవాళ రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగా జేఏసీ ఏర్పాటు చేయడం జరిగిందో ఇప్పుడు మళ్లీ అదే విధఃగా జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది.. పీఆర్సీ, డీఏ ఇస్తామ‌ని ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పెట్టారు.. కానీ దానిపై స్పంద‌న లేనే లేదు. గ‌తంలో రెండు డీఏలు ఇవ్వ‌కుంటేనే ధ‌ర్నాలు చేసేవాళ్లం. కానీ ఇప్పుడు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ వెంటనే అమలు చేయాలి. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టింది. హెల్త్ స్కీం వెంటనే అమలు చేయాలి. గత ప్రభుత్వం మాకు కంట్రిబ్యూష‌న్‌ కింద హెల్త్ స్కీం చేస్తాం అన్నారు.. జీవో కూడా వచ్చింద‌ని ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధులు గుర్తు చేశారు.

ఉద్యోగ సంఘాల‌తో స‌మావేశం అవుతామ‌ని ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ నాయ‌కులు చెప్పారు. ఇప్పుడు త‌మ సమ‌స్య‌లను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌భుత్వం, సీఎం సిద్ధంగా లేన‌ట్లు అనిపిస్తుంది. భాగ్యనగర్ సొసైటీ, ఇతర సొసైటీ భూములను మాకు అప్పగించాలని కోరుతున్నాము. 15 రోజుల్లో మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం. అన్ని జిల్లాలో తిరిగి అందరిని కలుపుకొని ముందుకు పోతాం. మా ఉద్యమాన్ని మ‌రింత ఉధృతం చేస్తాం. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పెట్టిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని మాత్ర‌మే మేం కోరుతున్నాం అని పేర్కొన్నారు.

ఒక‌టో తేదీన జీతాలు ఇస్తున్నారు.. కానీ ఇంకా కొన్ని డిపార్ట్‌మెంట్‌ల్లో జీతాలు ఒక‌టో తేదీన రావ‌డం లేదు. కాంట్రాక్టు ఉద్యోగుల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించాలి. మా న్యాయ‌మైన డిమాండ్ల‌ను త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించాలి. స‌మ‌స్య‌లు ప‌రిష్కారం చేయ‌కుంటే మా కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాం. మా స‌మ‌స్య‌ల‌పై అంద‌రిని క‌లుస్తాం. గురుకుల పాఠశాలలో సమస్యలు వెంటనే పరిష్కారించాలి. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరి ఈ జేఏసీ పని చేస్తోంది అని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్ర‌తినిధులు పేర్కొన్నారు.