విధాత:యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ బుధవారం(4న) పర్యటించనున్నారని సమాచారం. తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ఈ ఏడాది జూన్ 22న సీఎం పర్యటించారు. గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేశారు. ‘ఇంకా 20సార్లు వస్తా.. ఊరు మధ్యలో కూర్చుని మాట్లాడుకుందాం’ అని ఆ రోజు చెప్పారు. జూలై 10న రావాల్సి ఉన్నా అనివార్య కారణాలతో పర్యటన వాయిదా పడింది. ఈసారి సీఎం తప్పక వస్తారని.. వాసాలమర్రిలోని దళితవాడలను పరిశీలిస్తారని తెలిసింది. గ్రామంలోని రైతువేదిక భవనంలో ప్రజలతో సమావేశం నిర్వహించేలా జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే గ్రామాన్ని కలెక్టర్, ఉన్నతాధికారులు సందర్శించారు. సర్పంచ్ తదితర ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు.