విధాత, హైదరాబాద్:
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దాతృత్వం చాటుకున్నారు. తన సొంత గ్రామాభివృద్ధికి 11 ఎకరాల భూమి విరాళంగా అందజేశారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని స్వగ్రామమైన రహత్నగర్లో టీపీసీసీ చీఫ్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు తన సొంత భూమి పది ఎకరాలు, సబ్ స్టేషన్కు ఒక ఎకరాన్ని విరాళంగా ఇచ్చారు. గ్రామంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.50 లక్షలతో నిర్మిస్తున్న దుర్గాదేవి నూతన ఆలయ భూమి పూజలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి మహేశ్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ, తన గ్రామం మీదుగా కొండగట్టు ఆంజనేయ స్వామి, వేములవాడ, ధర్మపురి దేవాలయాలను కలుపుతూ టెంపుల్ కారిడార్ రోడ్డు నిర్మాణానికి 380 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలకు మహేశ్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.
తన బాల్యానికి సంబంధించిన గుర్తులను ఈ సందర్భంగా ఆయన నెమరేసుకున్నారు. “బాల్యం తీపి గుర్తులను ఎప్పటికీ మరిచిపోలేను. తల్లిదండ్రులు చేసిన సేవల వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. నేను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదు. గ్రామంతో నా అనుబంధం చివరి శ్వాస వరకు కొనసాగుతుంది. గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాను. గ్రామం మీదుగా వెళ్లే టెంపుల్ కారిడార్ రోడ్డు కోసం సీఎం, సంబంధిత మంత్రితో మాట్లాడి పైగా నిధులు మంజూరు చేయించాను. “ఈ రహత్నగర్ టెంపుల్ కారిడార్ రోడ్తో కరీంనగర్–నిజామాబాద్ మధ్య సెంర్ పాయింట్ అవుతుంది. గ్రామానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉన్నత విద్య సౌకర్యాలు లభిస్తాయి. గ్రామ అభివృద్ధి చేయడం నా బాధ్యతగా భావిస్తున్నా’’ అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడిచారు.
