బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ఉదయ్ నాగరాజు పోటీ పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నాడు.
లేబర్ పార్టీ నుంచి బరిలో ఉదయ్ నాగరాజు
విధాత, హైదరాబాద్ : బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ఉదయ్ నాగరాజు పోటీ పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నాడు. ఆయనను లేబర్ పార్టీ ‘నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్’ పార్లమెంటరీ కాండిడేట్గా ప్రకటించింది. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ప్రస్తుతం బ్రిటన్లో ఎన్నికల హడావిడి మొదలయింది. శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు హనుమంత రావు, నిర్మలాదేవి దంపతుల కుమారుడు ఉదయ్. బ్రిటన్లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ అఫ్ లండన్లో పాలనా శాస్త్రంలో పీజీ చేసారు.
భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్-ట్యాంక్ను నెలకొల్పారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు సంపాదించారు. క్షేత్రస్థాయి సమస్యలపైన ఉదయ్కు మంచి పట్టు ఉంది. స్కూల్ గవర్నర్గా, వాలంటీర్గా, రాజకీయ ప్రచారకుడిగా దశాబ్దకాలంగా ఇంటింటికీ ప్రచారంలో పాల్గొంటూ సామాన్యుల కష్టాలపై మంచి అవగాహన సాధించారు. వచ్చే ఎన్నికల్లో లేబర్ పార్టీ అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు తేల్చి చెబుతున్నాయి. తెలుగు బిడ్డ ఉదయ్ కూడా బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా ఘన విజయం సాధించనున్నుట్లగా తెలుస్తుంది.