విధాత, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 4:05 గంటలకు ఆలయ తలుపులు తెరచి, విశేష పుష్పాలంకరణలో అమ్మవారి తొలి దర్శన భాగ్యం కల్పించారు. సీఎం రేవంత్ రెడ్డి మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్ లు ఉన్నారు.
అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారిని దర్శించుకుని బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి పంటలు పుష్కలంగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు సరికొత్త టెక్నాలజీ, డ్రోన్లు, సీసీ కెమెరాలతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులు అమ్మవారికి ఆషాడం బోనం, సారే సమర్పించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వద్ది రాజు సహా పలు పార్టీల నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు.
