Site icon vidhaatha

Bandi Sanjay | బీజేపీలో కాదు.. కాంగ్రెస్‌లోనే బీఆరెస్‌ విలీనం: బండి సంజయ్

కేసీఆర్ కు ఏఐసీసీ, కేటీఆర్ కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయం
పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న చరిత్ర ఆ పార్టీల సొంతం
కవిత బెయిల్ పై కావాలనే బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం
కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
అవినీతి కేసుల్లో కేసీఆర్ కుటుంబంపై చర్యలేవని నిలదీత

విధాత, హైదరాబాద్ : బీజేపీలో బీఆరెస్‌ విలీనమవుతుందని, అందులో భాగంగానే కవితకు బెయిల్ రాబోతుందంటూ సీఎంరేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని, వాస్తవానికి అతి త్వరలో కాంగ్రెస్‌లోనే బీఆరెస్‌ విలీనం తథ్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కవితకు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనేది న్యాయ స్థానం పరిధిలోని అంశమని, కవిత బెయిల్ కు, బీజేపీకి ఏం సంబంధమని, ఆప్ పార్టీని వీలీనం చేసుకుంటేనే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా? సీఎం పదవిలో కొనసాగుతూ రాజకీయ లబ్ది కోసం గౌరవ న్యాయస్థానంపై బురద చల్లి కోర్టుల ప్రతిష్టను తగ్గించడం దుర్మార్గమని విమర్శించారు.

బీజేపీని బదనాం చేసేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారన్నారు. బీఆరెస్ పార్టీది ముగిసిన అధ్యాయమని, ప్రజలు ఛీత్కరించిన ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదన్నారు. బీఆరెస్‌ను విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతోందన్నారు. పథకం ప్రకారమే ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని, అతి త్వరలోనే కాంగ్రెస్ లో బీఆరెస్‌ విలీనమవడం తథ్యమని, అందులో భాగంగా కేసీఆర్ ను ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, కేటీఆర్‌ను పీసీసీ చీఫ్‌గా, హరీష్ రావుకు మంత్రి, కవితకు రాజ్యసభ పదవులు ఖాయమని జోస్యం చెప్పారు. అంత ఉబలాటముంటే రాజ్యసభ ఎన్నికలొస్తున్నందున కవితను కాంగ్రెస్ పక్షాన రాజ్యసభకు పంపినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు.

పొత్తులు పెట్టుకుని..పదవులు పంచుకున్న చరిత్ర వారిదే

గతంలోనూ బీఆరెస్‌తో పొత్తు పెట్టుకోవడంతోపాటు మంత్రి పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్ కు ఉందన్నారు. అందుకే కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ సహా అనేక అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడ్డ కేసీఆర్, కేటీఆర్ సహా బీఆరెస్‌ నేతలు జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. బీఆరెస్‌తో కాంగ్రెస్ దాగుడు మూతల వ్యవహారం జగమెరిగిన సత్యమని, నువ్వు కొట్టినట్లు చేయ్… నేను ఏడ్చినట్లు చేస్తానన్నట్లుంది కాంగ్రెస్, బీఆరెస్ నేతల తీరు అని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాళేశ్వరం సహా అనేక అంశాల్లో వేల కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ కేసీఆర్, కేటీఆర్ లను జైలుకు పంపాలని, కేసీఆర్ కుటుంబ ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దాగుడుమూతలాడుతున్న కాంగ్రెస్, బీఆరెస్‌ పార్టీలకు ప్రజలు తగిన గుణ పాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.

Exit mobile version