Youth Suicide | హైదరాబాద్ : ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలని పెద్దలు చెబుతుంటారు. అంటే పెళ్లీడుకు వచ్చిన వారికి ఈ సామెతను పెద్దలు అన్వయిస్తుంటాయి. అంటే వయసు అయిపోయాక పెళ్లి చేసుకుని ఏం లాభం అని ఇజ్జత్ తీసేలా మాట్లాడుతుంటారు. అయితే చాలా మందికి వయసు పెరిగిపోతున్నా కూడా వివాహాలు కావు. అలాంటి వారు మనోవేదన చెందుతుంటారు. ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ యువకుడు కూడా పెళ్లి కావడం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు.
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన బూర సురేందర్, రమా దంపతులకు నరేష్(32) అనే కుమారుడు ఉన్నాడు. గత నాలుగేండ్ల నుంచి నరేశ్కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ కుదరడం లేదు. అమీర్పేట్ ప్రాంతంలో ఒక బట్టల షాపులో పని చేస్తున్నందుకు పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని గత కొన్ని రోజులుగా నరేష్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు నరేష్.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నరేష్ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
