నగరం నుంచి పెద్దఎత్తున విదేశాలకు ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్లో నిర్వహించిన 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు.
హాజరైన మంతులు, శ్రీధరాబాబు, కోమటిరెడ్డిలు
విధాత, హైదరాబాద్ : నగరం నుంచి పెద్దఎత్తున విదేశాలకు ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్లో నిర్వహించిన 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఆరోగ్య సంరక్షణకు ‘ఫార్మా’ పరిశ్రమ వెన్నుముక లాంటిదన్నారు. దేశంలో 35 శాతం ఫార్మా ఉత్పత్తులు తెలంగాణ నుంచే జరుగుతున్నాయని ఇది మన రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ప్రతి ఏటా 50వేల కోట్ల విలువైన మందులు ఎగుమతి చేస్తున్నామన్నారు. మాది పారిశ్రామిక ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని, 24 గంటలు మా క్యాబినెట్ అందుబాటులో ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఏ పరిశ్రమకు ఎలాంటి సమస్య రానివ్వమన్నారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్యలో ఫార్మా క్లస్టర్లు నిర్మించి.. ఈ పరిశ్రమను ప్రోత్సహిస్తామన్నారు. పరిశ్రమలకు విద్యుత్తు, నీటి సమస్య లేదని తెలిపారు. త్వరలో రాష్ట్రంలో కొత్త విద్యుత్తు పాలసీని తీసుకురాబోతున్నమని అన్నారు.
గ్రీన్ ఎనర్జీ, మిగులు విద్యుత్ అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రోగుల భద్రత, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో ఫార్మ రంగానిది కీలకపాత్ర అన్నారు. అత్యధిక నాణ్యతతో జనరిక్ మెడిసిన్ ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తూ తెలంగాణ గుర్తింపు సాధించిందని తెలిపారు. కరోనా కాలంలో ఫార్మసిస్టులు అసమానమైన చురుకుదనం ప్రదర్శించి, అవిశ్రాంతంగా శ్రమించారన్నారు. బిర్యానీ తోపాటు బయో ఫార్మకు ఇప్పుడు హైద్రాబాద్ ప్రసిద్ధి చెందిందన్నారు. సుగంధ ద్రవ్యాలు ఎగుమతి చేసే స్థాయి నుంచి జీవితాలను కాపాడే మందుల సరఫరా దశకు తెలంగాణ రాష్ట్రం చేరుకుందన్నారు. అందరికీ ఆరోగ్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తే దృఢమైన ప్రపంచాన్ని నిర్మించగలమన్నారు.
ఫార్మా రంగానికి కేంద్రంగా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు
ఫార్మా రంగానికి హైదరాబాద్ కేంద్రంగా మారిందని మంత్రి శ్రీధరాబాబు అన్నారు. దేశ, విదేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతులు జరుగుతున్నాయని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. పెట్టుబడిదారులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం కృత్రిమ మేద (ఏఐ) ఎంతో కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. ఏఐను అందిపుచ్చుకోవడానికి తగిన విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు శ్రీధరబాబు తెలిపారు.
త్వరలో తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ : మంత్రి కోమటిరెడ్డి
త్వరలోనే రాష్ట్రంలో రాజీవ్ గాంధీ స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. న్యాక్ సెంటర్ వద్ద మొత్వం 32 ఎకరాల విస్తీరణంలో స్కిల్ వర్సిటీ నిర్మిస్తామన్నారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. ఫార్మా దిగ్గజాలు సీఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వాలని కోరారు. రూ.32 వేల కోట్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. వైఎస్ఆర్ హయాంలో ఓఆర్ఆర్ నిర్మించామని, దాంతో హైదరాబాద్కు ఎన్నో ఐటీ పరిశ్రమలు వచ్చాయన్నారు. పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు సీఎస్ఆర్ (సామాజిక బాధ్యత)లో భాగంగా తోడ్పాటు అందించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.