Mother And Daughter Tiger Fight Over Territory | పులుల భీకర యుద్దం..పర్యాటకుల గుండెలు గుభేల్!
రణతంబోర్ అభయారణ్యంలో సఫారీ వాహనాల ముందు రెండు పులుల (తల్లి-కూతుళ్లు) మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ దృశ్యాన్ని చూసిన పర్యాటకులు భయంతో వణికిపోయారు.

విధాత : ఆవాసంపై ఆధిపత్యం కోసం పులుల మధ్య భీకర యుద్దాలు సాగుతాయన్నది తెలిసిందే. అలాంటి యుద్దమే ఓ ఆభయారణ్యంలో రెండుపులుల మధ్య చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. రణతంబోర్(Ranthambore) అభయారణ్యంలో సఫారీ వాహనాల్లో అడవి అందాలను. వన్యప్రాణులను తిలకించేందుకు వెళ్లిన పర్యాటకులకు దారిలో రెండు పులుల భీకర యుద్దం ఎదురైంది. పర్యాటకుల సఫారీ వాహనాలు వెలుతున్న మార్గంలో రోడ్డుదాటుతున్న క్రమంలో రెండు ఆడ పులులు ఎదురుపడ్డాయి. అయితే ఎవరి మార్గంలో అవి వెళ్లకుండా అనూహ్యంగా ఘర్షణకు దిగాయి. రెండు పులులు కూడా భీకర గర్జన హోరుతో పరస్పరం కలబడ్డాయి. తగ్గేదేలే అన్నట్లుగా రెండు పులులు పోరాటం సాగించాయి. తమ వాహనాల ముందే ఆ రెండు పులులు భీకర యుద్దం చేస్తున్న దృశ్యాన్ని పర్యాటకులు ఊపిరిబిగపట్టి మరి చూశారు. అవి మనసు మార్చుకుని ఆవేశంలో ఎక్కడా తమపై దాడి చేస్తాయోమోనన్న భయంతో బిక్కుబిక్కుమంటునే పులుల సంగ్రామాన్ని వీక్షించారు. కొద్దిసేపటి తర్వాతా అందులో ఓ పులి పోరాటాన్ని ఆపేసి అడవిలోకి వెళ్లిపోయింది. చిత్రంగా ఆ రెండు పులులు కూడా తల్లికూతుళ్లు అని అటవీ అధికారులు వెల్లడించడం విశేషం.
రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో.. జైపూర్ నుండి 130 కి.మీ దూరంలో ఉండే అద్భుతమైన అటవీ ప్రాంతమే ఈ రణతంబోర్ నేషనల్ పార్క్(Ranthambore National Park). ఉత్తర భారతదేశంలోనే అతిపెద్ద, అత్యంత ప్రసిద్ధిచెందిన జాతీయ అభయారణ్యాల్లో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది. ప్రఖ్యాత సందర్శక ప్రాంతంగా..వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లకు ఫేవరెట్ ప్లేస్ గా ఈ నేషనల్ పార్క్ పేరొందింది. ఇక్కడ ప్రధాన ఆకర్షన పెద్దపులులు. ఈ అభయారణ్యంలో రాయల్ బెంగాల్ జాతి పులులు(Royal Bengal tigers) సహా 80కి పైగా పులులు ఉన్నాయి. అలాగే చిరుతపులులు, ఎలుగుబంటులు, ఏనుగులు సహా పలు రకాల క్రూర జంతువులు కూడా చూడొచ్చు. అలాగే 40 రకాల క్షీరదాలకు, 330 రకాల పక్షులకు, 35 రకాల సరీసృపాలకు నిలయంగా ఉందంటారు. అటవీ అందాలను తిలకించేందుకు జీప్ సఫారీలు అక్టోబర్ 1 నుండి జూన్ 30 మధ్య అందుబాటులో ఉంటాయి. సఫారీ జీపుల నుంచే పులులు, ఇతర వన్యప్రాణుల ఫొటోలు దగ్గరి నుంచి తీసుకోవచ్చు.