సీఎంల కోటలకు ‘సర్‌’ బీటలు

బోగస్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు, బదిలీ అయిన ఓట్ల తొలగింపు పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఇద్దరు ముఖ్యమంత్రుల పాలిట శాపంగా పరిణమించిందా? ‘సర్’కు వ్యతిరేకంగా పోరాడిన ఇద్దరు ముఖ్యమంత్రులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న స్వంత నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కనీసం గమనించలేకపోయారా? దాని ఫలితమే ఇంతటి భారీ మూల్యమా? గణాంకాలు చూస్తే అవుననే అనిపిస్తున్నది.

సీఎంల కోటలకు ‘సర్‌’ బీటలు
  • వేల ఓట్ల తొలగింపుతో ఘోర పరాజయం
  • ఏం జరుగుతుందో గుర్తించని సీఎంలు
  • రాజకీయ ఉద్ధండులపై కాషాయ ప్రయోగం సఫలం!

విధాత, హైదరాబాద్ :

బోగస్ ఓట్ల ఏరివేత, చనిపోయిన వారి పేర్ల తొలగింపు, ఇతర నియోజకవర్గాల్లో ఉన్నవారి పేర్లు ఇలా చెప్పుకుంటూ పోతే పలు కారణాలతో కేంద్ర ఎన్నికల కమిషన్ కొద్ది నెలలుగా ఓటర్ల జాబితాలను జల్లెడ పడుతున్నది. దీన్నే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం) అంటారు. జల్లెడ పట్టే కార్యక్రమం ప్రతిపక్ష పార్టీల పాలిట శాపంగా మారుతుందనే విమర్శలు వింటున్నాం. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌తోపాటు అసోం ఎన్నికలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీని సాగనంపేందుకు శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించిన విషయం తెలిసిందే.

కేంద్ర ఎన్నికల కమిషన్ ‘సర్’ పేరుతో పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించిందనే విమర్శలు ఎదుర్కొంటున్నది. ఈ ఒక్క రాష్ట్రంలోనే 90 లక్షలకు పైగా ఓటర్లు తొలగించడంపై మమత అగ్గిమీదగుగ్గిలమయ్యారు. బీజేపీ ఆదేశాల మేరకు ఈసీ పనిచేస్తున్నదని విమర్శలు గుప్పించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ‘సర్’ను అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినా.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈసీ తన పని పూర్తి చేసింది.

  • 2021లో ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,00,935 ఉన్నారు.
  • ‘సర్’ పుణ్యమాని 2026 ఓటర్ల జాబితాలో భారీగా తగ్గిపోయారు.
  • పలు కారణాలు చూపుతూ ఈసీ అధికారులు నియోజకవర్గంలో 40,622 ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు.
  • ఎన్నికల నాటికి మొత్తం ఓటర్లు 1,60,313 మాత్రమే మిగిలారు.
  • వీరంతా టీఎంసీకి అనుకూలంగా ఉండే ఓటర్లు కావడంతో తొలగించారనే విమర్శలు టీఎంసీ శ్రేణులు చేశాయి.
  • ఈ భారీ తొలగింపులు బీజేపీ ఓటు బ్యాంకు పెరగడానికి, ఓటింగ్ సరళిని ప్రభావితం చేశాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
  • భవానీపూర్ నియోజకవర్గం నుంచి తాజా ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ శాసనసభా పక్షం నేత సువేందు అధికారి పోటీపడ్డారు.
  • నువ్వా నేనా అనే విధంగా ప్రచారం చేశారు.
  • సువేందుకు 73,917 ఓట్లు రాగా, మమతకు 58,812 ఓట్లు పోలయ్యాయి.
  • మమతపై 15,105 ఓట్ల మెజారిటీతో సువేందు విజయం సాధించారు.
  • అంతకు ముందు 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రియాంకా టిబ్రేవాల్ పై 58,835 ఓట్ల మెజారిటీతో మమతా బెనర్జీ గెలుపొందారు.
  • ప్రియాంకకు 26,428 ఓట్లు, మమతకు 85,263 ఓట్లు వచ్చాయి.
  • 1951లో ఏర్పాటు అయిన భవానీపూర్ నియోజకవర్గంలో 2026లో 1,60,313 మొత్తం ఓటర్లు ఉన్నారు.
  • ఈ అసెంబ్లీ సెగ్మెంట్ కొలకత్తా దక్షిణ్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2021 లో ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,00,935.

స్టాలిన్ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి

తమిళనాడు చెన్నై నగరంలోని కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఓట్లను తొలగించేందుకు ఈసీఐ ‘సర్’ తీసుకువచ్చిందని స్టాలిన్ ఎన్నికలకు ముందు తీవ్ర ఆరోపణలు చేశారు. సనాతన ధర్మం, హిందీ భాషను బలవంతంగా రుద్దడం, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కేంద్రానికి సవాళ్లు విసిరారు. ఏకపక్షంగా నియోజకవర్గాలను పునర్విభజన చేస్తే తమిళనాడు అగ్నిగుండం అవుతుందని, పాత డీఎంకే విశ్వరూపాన్ని చూడాల్సి వస్తుందని ఆయన కేంద్రంలోని బీజేపీ పెద్దలను హెచ్చరించారు. కొరకరాని కొయ్యగా మారిన స్టాలిన్‌ను ఇంటికి పంపించేందుకు ‘సర్’ను గుట్టుచప్పుడు కాకుండా వినియోగించుకున్నారనే వాదన విన్పిస్తున్నది.

  • చెన్నై జిల్లాలోని చెన్నై నార్త్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కొలత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్‌ను నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో కొత్తగా ఏర్పాటు చేశారు.
  • 2021లో ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,68,296 మంది.
  • 2026 వచ్చే సరికి 2,07,251 మాత్రమే మిగిలారు.
  • ‘సర్’ ప్రయోగించడం మూలంగా 61,045 ఓట్లు తగ్గాయి.
  • ఇలా తొలగించిన ఓట్లు డీఎంకే ఓటు బ్యాంకు అని, గుర్తించి, పట్టుబట్టి ఈసీ అధికారులు నిర్థాక్షిణ్యంగా తొలగించారనే విమర్శలు ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఆ పార్టీ శ్రేణులు నెత్తినోరు కొట్టుకున్నాయి.
  • వారి మాట అరణ్య రోదనగా మారింది తప్పితే, సరిదిద్దే ప్రయత్నం జరగలేదని రాజకీయ పెద్దలు అభిప్రాయపడుతున్నారు.
  • తాజా ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ కు 74202 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి, టీవీకే అభ్యర్థి వీఎస్.బాబు కు 82,997 ఓట్లు వచ్చాయి.
  • 8,795 ఓట్ల మెజారిటీతో బాబు, స్టాలిన్ పై గెలుపొందారు.

బాబు ఒకప్పుడు డీఎంకే పార్టీలో పనిచేశారు. తనకు టికెట్ దక్కకపోవడంతో ఏఐఏడీఎంకే పార్టీ లో చేరారు. అక్కడా గౌరవం దక్కకపోవడంతో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీవీకే లో చేరి స్టాలిన్ కు ప్రత్యర్థిగా బరిలో నిల్చుని విజయం సాధించి, రాష్ట్రంలోనే సంచలనం రేపారు. అంతకు ముందు 2016 లో ఏఐఏడీఎంకే అభ్యర్థి జేసీడీ ప్రభాకర్ పై 37,730 ఓట్ల మెజారిటీ తో ఎంకే స్టాలిన్ గెలుపొందారు. ప్రభాకర్ కు 53,573 ఓట్లు రాగా, స్టాలిన్ కు 91,303 ఓట్లు పోలయ్యాయి. 2021 ఎన్నికల్లో ఏఐఏడీఎంకే అభ్యర్థి ఆది రాజరామ్ 35,138 ఓట్లు రాగా స్టాలిన్ కు 1,05,522 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి రాజారామ్ పై 70,384 ఓట్లతో గెలుపొందారు. వరుసగా విజయం సాధిస్తూ వస్తున్న స్టాలిన్ అపజయం పొందారంటే సర్ వేటు తప్ప మరోటి కాదని డీఎంకే శ్రేణులు చర్చించుకుంటున్నాయి. నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటూ పెట్టని కంచుకోటగా స్టాలిన్ తయారు చేసుకున్నారంటున్నారు. అలాంటి నియోజకవర్గంలో ఓటమి పాలు కావడం శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి. సర్ పేరిట ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగిందని చెబుతున్నప్పటికీ ఇద్దరు ఉద్ధండ ముఖ్యమంత్రులను ఘోర పరాభవానికి గురిచేసిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.