బీజేపీకి మెజార్టీయే లేదు! ఎన్డీయేకు మెజార్టీ లభించిందని సంబరపడినా.. అందులో టీడీపీ, జేడీయూలే కింగ్మేకర్లుగా ఉన్నారు! గతంలో ఎన్డీయే భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జేడీయూల్లో మొదట నితీశ్ మళ్లీ బీజేపీ పంచన చేరగా..
(విధాత ప్రత్యేకం)
బీజేపీకి మెజార్టీయే లేదు! ఎన్డీయేకు మెజార్టీ లభించిందని సంబరపడినా.. అందులో టీడీపీ, జేడీయూలే కింగ్మేకర్లుగా ఉన్నారు! గతంలో ఎన్డీయే భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జేడీయూల్లో మొదట నితీశ్ మళ్లీ బీజేపీ పంచన చేరగా.. ఆఖరి నిమిషంలో టీడీపీ సైతం ఎన్డీయే గూటికే చేరింది. అయితే.. ఈ రెండు పార్టీలూ గతంలో శిబిరాలు మార్చిన నేపథ్యంలో మోదీ ఐదేళ్ల పాలన ఎలా ఉండబోతున్నదనే చర్చ నడుస్తున్నది. దీనికి తోడు రాజకీయాల్లో నంబర్ గేమ్ ఒక భాగమేనని మోదీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో చేసిన వ్యాఖ్య.. ఈ చర్చకు మరింత మసాలా జోడించింది. గతంలో నంబర్ గేమ్ను బీజేపీ అనేక రాష్ట్రాల్లో రసవత్తరంగా ఆడింది.
ఆ మేరకు ఫలితాలు పొందింది. బలం లేకపోయినా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడమే కాకుండా.. బలవంతంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల్లో అధికారంలో భాగస్వామి అయింది. అప్పుడంటే బీజేపీకి సొంతగా తిరుగులేని మెజార్టీ ఉన్నది. ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. ఈ నేపథ్యంలో మోదీ సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తారా? లేదా? అన్న చర్చ ఒకవైపు నడుస్తున్నది. అదే సమయంలో బీజేపీ అశక్తతను ఆసరాగా చేసుకుని తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు బీజేపీ తర్వాత ఎన్డీయేలోని రెండు పెద్ద పార్టీలు టీడీపీ, జేడీయూ ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ వైఖరి ఎలా ఉండబోతున్నదనేది ఆసక్తికరంగా మారింది.
మోదీ పాతికేళ్ల రాజకీయ ప్రయాణాన్ని గమనించిన ఎవరైనా ఆయన అణకువతో, ఒకరి డిమాండ్లకు లోబడి పనిచేస్తారని భావించే పరిస్థితి లేదు. రైతులు ఏడాదిపాటు ఢిల్లీలో చలిలో, ఎండలో, వానలో ఆందోళనకు దిగినా.. వందల మంది ఆ ఆందోళన సందర్భంగా చనిపోయినా మోదీ చలించలేదన్న విషయం తెలిసిందే. తనకు అవసరం అయినప్పడు మాత్రమే పంజాబ్, యూపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నారు తప్ప.. రైతు ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని కాదని పలువురు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
ఇప్పుడు కూడా మోదీకి ప్రభుత్వం కొన్నాళ్లు స్థిరంగా కొనసాగడం అవసరం. ఎందుకంటే.. ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి చేసి ప్రభుత్వ ఏర్పాటుకు ఇండియా కూటమి ప్రయత్నాలు చేయకపోయినా.. ప్రజా తీర్పును అమలు చేసేందుకు సరైన సమయంలో సరైన వైఖరిని తీసుకుంటామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు.. ఇండియా కూటమి దూకుడుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం, కొన్నాళ్లు దానిని స్థిరంగా నిలుపుకొని అప్పుడు నంబర్ గేమ్ ప్రారంభించడం మోదీ వ్యూహం అయి ఉండొచ్చన్న అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో తనకు పంటికింద నలుసుగా మారబోయే టీడీపీ, జేడీయూలను చీల్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఇందుకు తన మిత్రపక్ష పార్టీలనే చీల్చిన బీజేపీ గత చరిత్రే నిదర్శనమని పేర్కొంటున్నారు. ఈ దశలో మోదీ, షా రాజకీయ వ్యూహాలను ఎప్పటికప్పుడు పసిగట్టకపోతే ముందు మునిగేది టీడీపీ, జేడీయూలేనని చెబుతున్నారు.
ఎన్డీయేకు మెజార్టీ కట్టబెట్టినా.. బీజేపీని దేశంలోని అనేక ప్రాంతాలు నిర్ద్వంద్వంగా తిరస్కరించాయనేది వాస్తవం. ఒక విధంగా ఇది బీజేపీ వ్యతిరేక ఓటు. ఓట్లు తగ్గాయి.. సీట్లు గణనీయంగా తగ్గాయి. తమకు ఎదురే లేదనుకున్న యూపీ, రాజస్థాన్లో, మరిన్ని సీట్లు గెలుస్తామని నమ్మకంగా చెప్పిన మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బలే తగిలాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం కాస్తా.. ఎన్డీయే సర్కారుగా మారిపోయింది. ఇప్పుడు తాను అనుకున్నది అనుకున్నట్టు చేస్తూ ముందుకు పోయే పరిస్థితి లేదు. ఆర్థిక అభివృద్ధి, ద్రవ్యోల్బణ కట్టడి, నిరుద్యోగ సమస్య తదితర జనం ఎదుర్కొంటున్న అంశాలు ఎజెండాగా సంకీర్ణ ప్రభుత్వం ముందుకు వెళితే ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
మంత్రివర్గ కూర్పు విషయంలో ఇప్పటికి వస్తున్న వార్తల ప్రకారం టీడీపీ స్పీకర్, ఏడు నుంచి ఎనిమిది క్యాబినెట్ పోర్టుఫోలియోలతోపాటు.. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పదవిని కోరుతున్నట్టు తెలుస్తున్నది. అటు జేడీయూ సైతం నాలుగైదు కీలక శాఖలపై కన్నేసింది. వీటన్నింటికి మించి ఈ రెండు పార్టీలు తమ రాష్ట్రాలకు పదేళ్లుగా ప్రత్యేక హోదా కోసం ఎదురుచూస్తున్నాయి. ఒకవేళ వీటిపై ఆ రెండు పార్టీలకు తాత్కాలికంగా సర్దిచెప్పినా.. భవిష్యత్తులో వీటి నుంచి సమస్యలు ఎదురుకాబోవనే గ్యారెంటీ ఏమీ లేదు.
మోదీ, అమిత్షా రాజకీయాలు పదేళ్లుగా చూస్తున్నదే. మిత్రలాభం పాటిస్తూనే.. తగిన సమయం చూసుకొని వదిలేసిన ఉదంతాలు ఉన్నాయి. ఆయా పార్టీలలో ముసలం పుట్టించిన సందర్భాలూ ఉన్నాయి. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలు బలపడటాన్ని మోదీ తన స్వభావరీత్యానే ఇష్టపడరనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే గతంలో భాగస్వామ్య పక్షాలైనా శివసేన, అకాలీదళ్, అన్నాడీఎంకే, ఎల్జేపీ, పీడీపీ, తాజాగా జేజేపీ ఇలా అన్ని పార్టీల్లో బీజేపీ చీలిక తెచ్చింది. కనుక రానున్న రోజుల్లో ఏమైనా జరగొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అందులోనూ ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్కంటే.. ప్రాంతీయ పార్టీలు బీజేపీకి కొట్టిన దెబ్బలే ఎక్కువ. బీజేపీకి మెజార్టీ దక్కకపోవడానికి అదొక ప్రధాన కారణం. బీజేపీ తాను బలపడేందుకు ప్రాంతీయపార్టీలను అవి తన భాగస్వామ్య పార్టీలైనా బలి చేయడానికి వెనుకాడదన్న విమర్శలు ఉన్నాయి. రానున్న రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే మహారాష్ట్ర, బీహార్, హర్యానాలోనూ బీజేపీ సొంతంగానే మెజారిటీ సాధించేలా ఇప్పటి నుంచే వర్క్ ఔట్ చేస్తారని అంటున్నారు.
కీలక బిల్లలు పాస్ కావాలంటే ఈ రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే పెద్దల సభలోనూ సంఖ్యా బలం పెరుగుతుందనేది కాషాయపార్టీ ఆలోచన. మహారాష్ట్రలో శిండే వర్గాన్ని, బీహార్లో జేడీయూను బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరిగేందుకు అవకాశం ఉన్నదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ను ఉప ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పించాలన్న ఇస్తున్న సంకేతాలు అవేనని అంటున్నారు.
బీజేపీ నేతల్లో కనిపించని విశ్వాసం
ఫలితాల తర్వాత ఇండియా కూటమి నేతల్లో న్నంత విశ్వాసం బీజేపీలో కనిపించడం లేదు. మోదీలో అసలే లేదు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ, జేడీయూ అధినేతలను ఉద్దేశించి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. మోదీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నది వాటి సారాంశం. ఎందుకంటే నిలబెట్టే వారికి రాజకీయాల్లో నంబర్ గేమ్ భాగమే అని మోదీ చెప్పారు.
ప్రస్తుతం త్వరలో కొలువుదీరనున్న మోదీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ భవితవ్యం ప్రాంతీయపార్టీల చేతిలో ఉన్నది. బీజేపీ బలపడితే నిలబెట్టిన పార్టీలనే నిండా ముంచుతుంది అన్నది చరిత్రే. ఆ చరిత్రలో మరోసారి టీడీపీ, జేడీయూ జారి పడతాయా? లేక మోదీ, షాల నంబర్గేమ్ను అధిగమిస్తా? అన్నది భవిష్యత్తు తేల్చనున్నది.
హిందువులపై మండిపడుతున్న బీజేపీ శ్రేణులు
దేశంలో సంకీర్ణ యుగం పదేళ్ల తర్వాత మళ్లీ మొదలవుతున్నది. పదేళ్ల క్రితం వరకూ ఉన్న సంకీర్ణ యుగానికి కామా పెడుతూ బీజేపీని ఏకైక పెద్ద పార్టీగా రెండు పర్యాయాలు దేశ ప్రజలు గెలిపించారు. పేరుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం అయినా.. కూటమిలోని పార్టీలన్నీ పదేళ్లూ నామమాత్రంగానే మిగిలిపోయాయి. ఎవ్వరికీ ప్రశ్నించే అధికారం, డిమాండ్ చేసే హక్కు లేకుండా పోయాయి. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేసినా మౌనంగానే ఉన్నాయి. మొదటి ఐదేళ్ల కంటే రెండోసారి బీజేపీ సొంతంగా 300 మార్క్ దాటడంలో ఇక బీజేపీ నేతల విద్వేష వ్యాఖ్యలు, గోరక్షణ పేరుతో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
భారత్లో నెలకొన్న మత రాజకీయాలపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చినా లెక్క చేయలేదు. విపక్ష నేతలు, ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తే దేశ ద్రోహులుగా చిత్రించారు. ఈ క్రమంలోనే బీజేపీ నినాదాలైన రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌర స్మృతి వంటి వాటిని అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేశారు. వీటిలో మొదటి రెండింటిని పూర్తి చేసింది. వాటిని బీజేపీ ఘనతగా చెప్పుకుని వివిధ రాష్ట్రాల్లో రాజకీయంగా కొంతమేరకు లబ్ధి పొందింది. మరోవైపు మద్దతు ఇచ్చిన ప్రాంతీయ పార్టీలు బలహీనపడటం ప్రారంభమైంది. ఇదంతా ఒక వ్యూహాత్మకంగా అమలు చేశారు.
స్వతహాగా ప్రాంతీయపార్టీల ఎదుగుదలను అంగీకరించని మోదీ మెల్లగా ప్రాంతీయపార్టీలను దెబ్బతీశారు. ఆ విశ్వాసంతోనే ఈసారి ఎన్నికల్లోనూ ఎన్డీఏకు 400పైగా సీట్లు వస్తాయని, బీజేపీ సొంతంగా 370 సీట్లు దక్కించుకుంటుంది అని అనుకున్నాయి. కానీ.. సీన్ రివర్స్ అయింది. నిజానికి గతంలో విజయాలకు కారణమైన మతతత్వ అజెండానే ఈసారి కూడా గట్టెక్కిస్తుందని బీజేపీ నేతలు నమ్మినా.. జనం మాత్రం ఆ అజెండాను తిరస్కరించారు. బీజేపీకి కేంద్రంలో రెండుసార్లు స్పష్టమైన మెజారిటీ రావడానికి కారణమైన యూపీలోనే ఇండియా కూటమి ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది.
2019లో 62 స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ 29 సీట్లు కోల్పోయి 33 స్థానాలకే పరిమితమైంది. రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాఖ్, సీఏఏ, సర్జికల్ స్ట్రైక్స్ వంటి ప్రచార నినాదాలతో తమకు గణనీయంగా ఓట్లను రాలుస్తాయని 70కి పైగా సీట్లు గెలుస్తామని అంచనా వేసింది. వాటిని యూపీ ఓటర్లు పట్టించుకోలేదు. చివరికి అయోధ్య జిల్లాలోని ఫైజాబాద్లోనే ఆ పార్టీ అభ్యర్థి 54,567 ఓట్ల తేడాతో ఎస్పీ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. అలాగే సుల్తాన్పూర్లో బీజేపీ అభ్యర్థి మేనకాగాంధీ ఎస్పీ అభ్యర్థి రాంభూపాల్ నిషాద్ చేతిలో 43,174 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ రెండు స్థానాల్లో బీజేపీ ఓటమి చెందడానికి కారణం ఆ పార్టీ పదేళ్లు చేస్తున్న నినాదాలను ప్రజలు విశ్వసించలేదు.
ఫైజాబాద్, సుల్తాన్పూర్ రెండూ పక్కనే ఉంటాయి. కానీ పైజాబాద్లో బీజేపీ రామనామ జపం చేసింది. సుల్తాన్పూర్ ఆ అంశాన్ని పెద్దగా ప్రస్తావించలేదు. మేనకాగాంధీ కూడా స్థానిక సమస్యలపైనే ప్రచారం అయినా ఓటమి తప్పలేదు. దీనికి పదేళ్లుగా మోదీ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి కల్పనలపై దృష్టి సారించకపోవడం, ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలు చేపట్టకపోవడం వంటివి ప్రభావం చూపెట్టాయి. ఈ రెండు చోట్ల బీజేపీ ఓడిపోవడానికి కారణం ఆపార్టీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో పట్టించుకోకుండా అన్నింటికీ జైశ్రీరాం ఒకటే మంత్రం అన్నట్టు వ్యవహరించింది. భక్తి విశ్వాసాలను రాజకీయాల కోసం వాడుకోవడానికి ప్రజలు తిరస్కరించారు అనడానికి ఇదే నిదర్శనం.
దీనిపై బీజేపీ వాట్సప్ యూనివర్సిటీ విష ప్రచారం చేస్తున్నది. హిందువులంతా ఆపార్టీ కార్యకర్తలైనట్లు, ఫైజాబాద్లోని ఓటర్లకు బుద్ధి లేదన్నట్టు ప్రచారం చేస్తున్నారు. వాళ్లు ఒక విషయాన్ని మరిచిపోతున్నారు. బీజేపీ పుట్టకు ముందు నుంచే అక్కడ వాళ్లు నివసిస్తున్నారు. వాళ్లు దేవుడి ఆరాధిస్తున్నారు. అక్కడి ప్రజలు ఎవరి మత విశ్వాసాలను వాళ్లు పాటిస్తున్నారు. పదేళ్లుగా మేం ఏం చేయకపోయినా రాముడి పేరు చెప్పి మేము ఓట్లు అడుగుతాం. మీరు వెయాల్సిందే అన్నట్టు మాట్లాడుతున్నారు. అలాగే బీజేపీ గెలిస్తే పాకిస్థాన్లో టీవీలు పగలగొడుతారు అని బీజేపీ నేతలు ప్రచారం చేస్తారు.
ఫైజాబాద్లో బీజేపీ ఓడిపోయాక టీవీలు పగలగొట్టారు. హిందువులు బీజేపీకి అన్యాయం చేశారని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం కట్టడి విఫలం, వ్యవసాయ వ్యతిరేక విధానాలు, అగ్నివీర్ పథకంపై యువతలో ఉన్న అసంతృప్తే యూపీ, బీహార్, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ సీట్లకు భారీగా గండి కొట్టాయన్న విషయాన్ని పార్టీ నేతలు గ్రహించాలి. అంతేగానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతే ఓటర్లదే తప్పు అన్నట్టు బీజేపీ వాళ్లు కూడా ప్రజలను నిందించడం హాస్యాస్పదంగా ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read More