ఉద్యోగం రాక  అమెరికాలో ఆంధ్రా యువకుడి ఆత్మహత్య.. మృతదేహం కోసం కుటుంబం ఎదురుచూపులు

అమెరికాలో ఉద్యోగం దొరకక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చందు ఆత్మహత్య. కర్నూలులో కుటుంబం మృతదేహం కోసం ఎదురుచూపులు. భారీ ఖర్చుతో ఫండ్‌రైజింగ్ ప్రారంభం, ప్రభుత్వం సహాయం హామీ.

Reported by: ADHARVA | ఆంధ్ర ప్రదేశ్ | May 01, 2026, 11:57 pm IST
Read Time: 5 mins
ఉద్యోగం రాక  అమెరికాలో ఆంధ్రా యువకుడి ఆత్మహత్య.. మృతదేహం కోసం కుటుంబం ఎదురుచూపులు ఉద్యోగం కోసం పోరాడిన ఆంధ్ర విద్యార్థి చందు

Unemployed Andhra Student Dies by Suicide in US, Family Awaits Body Amid Fundraiser Efforts

అమెరికాలో తెలుగు విద్యార్థి విషాదం

ఉద్యోగం దొరకక కర్నూలు యువకుడు చందు అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి భారీ ఖర్చు కారణంగా కుటుంబం ఇబ్బందులు పడుతోంది. నిధుల సేకరణ కొనసాగుతోంది. ప్రభుత్వం సహాయం చేస్తామని తెలిపింది.

 

విధాత ఏపీ డెస్క్​ | హైదరాబాద్​:

అమెరికా వెళ్లిన ప్రతి తెలుగు విద్యార్థి కలల వెనుక ఒక కఠినమైన వాస్తవం దాగి ఉంటుంది. ఉద్యోగం కోసం పోరాటం, ఆర్థిక ఒత్తిడి, ఒంటరితనం… ఇవన్నీ కలిసి దాడి చేసినప్పుడు జీవితమే భారంగా మారుతుంది. కర్నూలుకు చెందిన 26 ఏళ్ల యువకుడు ఇరగనబోయిన చందు కథ కూడా అలాంటిదే — ఆశలతో వెళ్లి, నిరాశల మధ్య ముగిసిన జీవితం.

ఉద్యోగం లేక ఒత్తిడి.. ప్రాణం తీసుకున్న చందు

DePaul University Chicago campus

చందు చదివిన చికాగోలోని డిపాల్ యూనివర్సిటీ

కర్నూలు జిల్లాకు చెందిన ఇరగనబోయిన చందు (26) అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అతడు చికాగోలోని DePaul University నుంచి మాస్టర్స్ పూర్తి చేసి, గత కొన్ని వారాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు.

అయితే ఉద్యోగం దొరకకపోవడం తీవ్ర మానసిక ఒత్తిడిని పెంచిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ముఖ్యంగా, కర్నూలులో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న తన తండ్రిపై ఆర్థిక భారం పడుతున్నందుకు చందు తీవ్రంగా బాధపడినట్లు సమాచారం.

ఈ నిరాశ, ఒత్తిడి చివరకు అతడు తీవ్ర నిర్ణయం తీసుకునేలా దారితీసింది. అమెరికా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మృతదేహం కోసం దురుచూపుల్లో కుటుంబం.. భారీ ఖర్చు భారం..

చందు మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అమెరికాలోని భారతీయులు కలిసి ఒక ఫండ్‌రైజింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మృతదేహాన్ని అమెరికా నుంచి భారత్‌కు తరలించడానికి సుమారు 25,000 డాలర్లు (దాదాపు 20 లక్షల రూపాయలు) ఖర్చవుతుందని అంచనా. ప్రస్తుతం 1,20,000 డాలర్ల లక్ష్యంతో నిధుల సేకరణ జరుగుతోంది.

ఇప్పటికే రెండు రోజుల్లోనే 76,000 డాలర్లకు పైగా సేకరించడం గమనార్హం. అదనంగా వచ్చే నిధులను కుటుంబ అప్పులు తీర్చేందుకు వినియోగించనున్నారు.

ప్రభుత్వం స్పందన.. సహాయం హామీ

Iraganaboyina Chandu Andhra student who died in US

అమెరికాలో మృతి చెందిన కర్నూలు యువకుడు ఇరగనబోయిన చందు

సోషల్ మీడియాలో వచ్చిన విజ్ఞప్తికి స్పందించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్​, కేంద్ర విమానయాన మంత్రి రామ్​మోహన్​ నాయుడును సంప్రదించి మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు సహకరించాలని కోరారు.

దీనిపై స్పందించిన రామ్ మోహన్ నాయుడు, సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నామని, ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు.

విదేశాలకు వెళ్లే ప్రతి విద్యార్థి కథ విజయంతో ముగియదు. కొన్నిసార్లు ఒత్తిడులు, ఒంటరితనం, ఆశల భారమే ప్రాణాలను తీస్తుంది. చందు ఘటన అలాంటి కఠిన వాస్తవాన్ని మరోసారి గుర్తుచేస్తోంది.